సిద్దిపేట, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “బీఆర్ఎస్ పూల బాటలు చూసింది…ముళ్ల బాటలు చూసింది..విజయాలు..అపజయాలు చూశాం. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు. అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్ మళ్లీ బీఆర్ఎస్దే” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభ జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు గొప్పవాళ్లు ..వాళ్ల తీర్పును మనం గౌరవించాలన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, కొన్ని సార్లు గెలిచాం..కొన్నిసార్లు ఓడిపోయామన్నారు. ఇంత అద్భుతమైన గెలుపు అందించిన మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 1.8 శాతం మాత్రమే మనకు ఓట్లు తక్కువ వచ్చాయన్నారు. ఇటీవల హైదరాబాద్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ జరిగిందని, పలు సూచనలు చేశారన్నారు. కొన్ని పథకాలు మనకు ఇబ్బంది కలిగించాయన్నారు.
బీఆర్ఎస్ కన్నతల్లిలాంటిది..
బీఆర్ఎస్ కన్నతల్లి లాంటిది…మన మధ్య భేదాభిప్రాయాలు ఉంటే కూర్చుండి మాట్లాడుకోవాలి తప్పా.. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉండవద్దని హరీశ్రావు అన్నారు. పార్టీ ఉంటేనే మనందరికీ గౌరవం ఉంటుందన్నారు. పార్టీ కోసం పని చేయాలి..ఎక్కడ కూడా డీలా పడవద్దన్నారు. ఉద్యమంలో ఎలా కొట్లాడినామో అలా ముందుకుపోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా మొన్న సిద్దిపేటలో వచ్చిన మెజార్టీ కంటే పదిరెట్లు ఎక్కువ రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాదు.. అది బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేసింది..
తెలంగాణ రాకముందు కరెంట్, సాగు, తాగునీరు, పండిన పంటల పరిస్థితి..ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలను ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ తీరు ఎలా ఉంది అంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు …నేడు పాలనలో అసహనం..ఎన్నికల ప్రచారంలో గ్ల్లోబెల్ ప్రచారం చేశారని విమర్శించారు.ఆనాడు దావోస్కు పోతే దండగ అన్నారు, తాజాగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఎలా పోయారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
కొన్ని యూట్యూబ్ చానళ్లు కొంపముంచాయి..
నిజం నిలకడగా ఉంటుంది. మనల్ని కొన్ని యూట్యూబ్ చానళ్లు కొంప ముంచాయని హరీశ్రావు అన్నారు. నిజం గడపదాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నారు. మనం చేసిన మంచి పనులు చెప్పుకోవడంలో వెనుకబడిపోయామన్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు కానీ సిద్దిపేట జిల్లా ఏర్పాటు కాలేదన్నారు. దశాబ్దాల కల కేసీఆర్ వల్ల సాధ్యమైందన్నారు. ఒక్క సిద్దిపేటనే కాకుండా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లామన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటి పనులను కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారన్నారు.
ఇప్పుడు అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్ని హామీలిచ్చిందో మీఅందరికీ తెలుసన్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు.మరి అయిందా..? కాంగ్రెస్ వాళ్లు ఏరకంగా ప్రజలను మోసం చేశారో అర్థమవుతుందన్నారు. రైతు బంధు గురించి అడిగితే మంత్రులు తలో రకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, నాయకులు రాజనర్సు, సంపత్రెడ్డి, సాయిరామ్, నాగిరెడ్డి, వివిధ మండలాల ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థి, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.