రామచంద్రాపురం, జనవరి 31: దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ఆర్సీపురం పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 4న భారతీనగర్ డివిజన్లోని హెచ్ఐజీ కాలనీలో రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఇంటి నంబర్ 99లో దొంగతనానికి పాల్పడి 20 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి వస్తువులు, ఇంటి నంబర్ 151లో ఏపీ 28 డీడీ 1993 స్కూటీని దొంగలించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారించి దొంగతనాలకు పాల్పడింది పాత నేరస్తుడు సికింద్రాబాద్కు చెందిన మంత్రి శంకర్ అలియాస్ శివన్నగా భావించి, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగలించిన స్కూటీపైనే నిందితుడు మంగళవారం బీహెచ్ఈఎల్లో తిరుగుతుండగా, పోలీసులు అతడిని గుర్తించి పట్టుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. హెచ్ఐజీ కాలనీలో రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో అతడి నుంచి 19.4 తులాల బంగారు ఆభరణాలు, 12తులాల వెండి వస్తువులు, స్కూటీనీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు సుమారుగా 250 దొంగతనాలు చేశాడు. అతడిపై ఐదు పీడీయాక్ట్లు ఉన్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి కేసుని ఛేదించినట్లు ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సైలు, క్రైం సిబ్బందిని సీపీ, డీసీపీ, ఏసీపీ అభినందించారు.