సిద్దిపేట అర్బన్, జనవరి 8: రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి.. కోటా మేరకు భారత ఆహార సంస్థకు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్లోని డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ, యాసంగిసాగు, వానకాలం మిల్లింగ్ రైస్ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైస్మిల్లులను అధికారులు నిరంతరం సందర్శిస్తూ.. పూర్తిస్థాయిలో మిల్లింగ్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కేటాయించిన ధాన్యం నిల్వలను పరిశీలించాలని.. ఎక్కడైనా పక్కదారి పట్టించి.. అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నిర్ణీత గడువులోపు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.