మెదక్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రామాయంపేట కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానున్నది. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్లో జరిగిన ‘ప్రగతి శంఖారావం’ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త డివిజన్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట గ్రామీణ మండలాలు, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో నార్సింగి మండలాలను వేరు చేసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసినందుకు సీఎ కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నెల 23న మెదక్లో జరిగిన సభలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ మంజూరు చేశారు. 24 గంటల్లో ఉత్తర్వులు ఇస్తానని ప్రకటించారు. ఆ విధంగానే 24 గంటల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రామాయంపేట ప్రజల ఎన్నో ఏండ్ల కల నెరవేరింది.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
ఈ నెల 23న సీఎం కేసీఆర్ రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు 15 రోజుల్లో జిల్లా కలెక్టర్కు దరఖాస్తులు అందించవచ్చు. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జీవో 284ను విడుదల చేశారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 23న మెదక్లో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సీఎం కేసీఆర్ వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీఎం రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలను కలిపి రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్తో పాటు నర్సాపూర్, తూప్రాన్తో మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా, ఇప్పుడు రామాయంపేట డివిజన్ ఏర్పాటు కానున్నది.
మెదక్ జిల్లాలో ఇప్పటికే మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య నాలుగుకు చేరనున్నది. మెదక్ డివిజన్లో 10 మండలాలు మెదక్, హవేళీఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, రామాయంపేట్, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాలు ఉన్నాయి. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాలు కలవనున్నాయి. తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి, మాసాయిపేట మండలాలున్నాయి. ఇందులో నుంచి నార్సింగి మండలం మాత్రమే రామాయంపేట రెవెన్యూ డివిజన్లో కలువనున్నది. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లో నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట్, కొల్చారం, చిలిపిచెడ్ మండలాలున్నాయి.
రామాయంపేట, ఆగస్టు 25: మా గిరిపుత్రులకు ఆరాధ్యదైవాలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి లేనని గిరిజన తండాల వాసులు పేర్కొన్నారు. రామాయంపేట మండలం దంతెపల్లి పంచాయతీ పరిధిలోని ఇటీవల ఆరు తండాలను కలిపి పంచాయతీగా మార్చడమే కాకుండా, రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గిరిజన తండావాసులు శుక్రవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో గిరిజన తండాల వాసులు ఆయా గ్రామాలు కాట్రియాల, లక్ష్మాపూర్, దంతెపల్లి, కిషన్నాయక్, పర్వతాపూర్ గ్రామాల సర్పంచ్లు సురేశ్ నాయక్, లంబాడీ బుజ్జి దేవేందర్, శ్యాములు, దుర్గమ్మ, దయాలక్ష్మి, సుభాష్రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులున్నారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రామాయంపేటతో పాటు ఆయా మండలాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నో ఏండ్ల కల సీఎం కేసీఆర్ నెరవేర్చారని, రామాయంపేట డివిజన్గా ఏర్పాటు చేసినందుకు సీఎంకు రుణపడి ఉంటామన్నారు. దంతెపల్లి పంచాయతీ పరిధిలోని తండాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి ఫలించిందని రామాయంపేటతో పాటు ఆయా మండలాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.