కళ్యాణి చాళుక్యులు శివుడికి ఎంతో భక్తితో నిర్మించిన ఆలయమది. ఆ ఆలయంలోని శిల్పసంపద చూసినవారు అచ్చెరువొందక మానరు. కళ్లను మిరిమిట్లు గొలిపే శిల్పకళా సంపద ఆ ఆలయం సొంతం. చేయి తిరిగిన శిల్పులు నల్లరాతిపై ఒక్కో శిల్పాన్ని చెక్కిన తీరు అహో అద్భుతం! ఆ ఆలయమే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని మహాపుణ్యక్షేత్రం శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం. మాటలకందని ఆ నందికంది శివాలయం గురించి చదివి ఆ‘నంది’ంచండి…
సంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): అత్యంత పవిత్రమైన, పురాతనమైన శైవాలయాల్లో ఒకటైన శివాలయం సంగారెడ్డి జిల్లా నందికందిలో ఉంది. కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం విశిష్టత అంతా ఇంతా కాదు. అశుతోషుడైన శంకరుడు ఈ ఆలయంలో మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలందుకుంటున్నాడు.
కళ్యాణి చాళుక్యులు క్రీశ 973 నుంచి 1200 సంవత్సరం వరకు.. అంటే తైలపుడు అహవమల్ల (973-996) నుంచి మొదలు త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుడు సోమేశ్వరుడి (1182-1200) వరకు సంగారెడ్డి ప్రాంతాన్ని పాలించారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల అంచనా ప్రకారం నందికంది శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని క్రీ.శ.1014లో కళ్యాణి చాళుక్య రాజు విక్రమాదిత్య పాలనలో నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న శిలాశాసనాలను అనుసరించి నందికంది పూర్వనామం కిరియ కన్ది. సంగారెడ్డికి నైరుతి దిశలో ముంబయి జాతీయ రహదారి పక్కనే ఉంటుందీ శివాలయం.
అతి ప్రాచీన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. తామర పుష్ఫ ఆకారంలో గర్భగుడి ఉంటుంది. నవరంగ మండపం, చతుర్థ శిలాస్తంభాలతో మండపం ఉంటుంది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఆలయ వెనకభాగంలో పద్మాకృతి ముద్ర ఉంది. గర్భగుడిలో కొలువైన మృత్యుంజయ మహాశివలింగ స్వరూపుడైన రామలింగేశ్వరస్వామి ప్రతి వారు దర్శించవచ్చు. ఆలయ ప్రవేశద్వారం ఆరంభంలోనే ఆలయ చరిత్రను మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ప్రవేశద్వారం పైభాగంలో ఏకశిలకు ఇరువైపులా ఉన్న విగ్రహాల్లో తూర్పుదిశను అష్టభుజాలతో ఉన్న నటరాజస్వామి, ఒక పక్కగా ఒదిగి పరిశీలిస్తే మహిషాసురమర్ధిని దర్శనమిస్తారు.
హిందూ దేవతలతోపాటు నర్తకులు, ఏనుగులు, సింహాలు, పద్మాలు, పద్మలతలను అందంగా చెక్కారు. ఆలయంలోని ప్రతిమూలలో అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఆలయం మొత్తం విమాన నక్షత్రాకారంలో ఉండి 16 కోణాల్లో ఉంది. 16 కోణాలకు షోడష ఉపచారాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ముఖమంటపం, అంతరాళం, గర్భగృహంతో ఆలయం ఉంటుంది. ఈ ఆలయ మండపానికి తూర్పు, ఉత్తరం, దక్షిణాన ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై ఆమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మ-విష్ణు-నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుడిని సహరించే దృశ్యాలు, వరాహావతారం, నటరాజు, శివుడు, కాళీమాత, మహిషాసురమర్ధిని, వాగ్దేవి, నృత్యగణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, అప్సరసలు, జంతువుల దృశ్యాలున్నాయి.
ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల శైవభక్తికి, శిల్పకళా తృష్ణకు మచ్చుతునకగా పేర్కొన్నవచ్చు. కళ్యాణి చాళుక్య రాజుల కళాసృష్టికే అద్దం పట్టే ఈ ఆలయంలో ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. శేషాద్రి రమణ కవులు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, నెలటూరి వెంకట రమణయ్య ఈ ఆలయ విశిష్టత గురించి తెలంగాణ శాసన పంపటిలో వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మ్యూజియం ఈ ఆలయం విశిష్టతను వివరిస్తూ పుస్తకాలను ముద్రించింది.
గర్భగుడిలోకి ప్రవేశించగానే ద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకుల విగ్రహాలు చెక్కారు. ద్వార పాలకుల విగ్రహాలకు దక్షిణ దిశలో ఒక మహాగణపతి విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో చెక్కారు. సెంట్రల్ హాల్లోని నాలుగు స్తంభాల మండపం లేదా నవరంగ మండపం అందంగా నిర్మించారు. నవరంగ మండపంలోని ఒక్కో రాతిస్తంభంపై హిందూ దేవతలు, దిక్పాలకుల శిల్పాలను చెక్కారు. దేవతలైన శివుడు, విష్ణువు, బ్రహ్మ, నర్సింహస్వామి, వరాహ స్వామి, నటరాజస్వామి, మహిషాసురమర్ధిని శిల్పాలను చెక్కారు. క్రాస్ బీమ్ ఆధారంతో మలిచిన రాతి స్లాబ్ అతి చక్కగా నిర్మించారు. దీన్ని మకర తోరణం అంటారు. మకర తోరణ అడుగు క్రాస్బీమ్పై పద్మపుష్ప మొగ్గులు అందంగా మలిచారు శిల్పులు. ప్రవేశ ద్వారంపై తూర్పు వైపు నటరాజు, పడమర గజలక్ష్మి విగ్రహం సర్వాంగ సుందరంగా చెక్కారు.
ఎక్కడా లేనివిధంగా సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువైన శివలింగా న్ని తాకేలా శిల్పులు మహా తోరణాన్ని మలిచారు. ఆలయం తోరణ పైకప్పు ఏడు తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్టు ఉన్నాయి. వీటి మధ్య ఆరు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రా ల గుండా ఉదయభానుడి కిరణాలు ఒక్కో రుతువులో ఒక్కో రంధ్రం గుం డా ప్రయాణిస్తూ మూలవిరాట్టు శివలింగంపై వెలుగులు ప్రసరింపజేస్తాయి. అప్పుడు మృత్యుంజయ శ్రీరామలింగేశ్వర దేవస్థానం దేదీప్యమానం గా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశ వెలుగుల్లో భక్తులు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు వదలుకుని శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే పాపాలు పటాపంచలై వారి జన్మధన్యమవుతుందని ప్రతీతి.
గర్భగుడిలోకి ప్రవేశిస్తుండగా మూ లవిరాట్టుకు ఎదురుగా నల్లని రాతితో మలిచిన నంది విగ్రహం నాలుగున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నం దీశ్వరుడికి ఎడమ భాగంలో కొలువై ఉన్న వినాయకుడి ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ ఆరంభంలోనే పురాతన రాతి శాసనంపై ఆలయ విశిష్టతతో పాటు శివుడు, విష్ణువు, బ్రహ్మలను చెక్కారు. ఈ ఆలయంలో కమలంభట్ వంశీకులు అర్చకత్వం చేస్తున్నారు.