మెదక్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరమని, మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం నుంచి మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు పథకాలను మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన పోస్టర్ను ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దవాఖానలో ఉన్న 108 వాహనాలను అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకంలో రూ. పది లక్షలకు పెంపు ద్వారా 1672 వ్యాధులకు చికిత్సను అన్ని స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ దవాఖానల్లో ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందునాయక్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, మెప్మా పీడీ ఇందిర, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, ఆర్టీసీ డీఎం సుధ, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, మహిళలు, ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు పాల్గొన్నారు.