కొల్చారం, జూలై 1: వానకాలం సీజన్ ప్రారంభమైంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రభుత్వం కాలువలు, మంజీరా నుంచి ఎత్తిపోతలు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతన్నలు ఒక్క ఎకరా వదలకుండా సాగు చేస్తున్నారు. కొల్చారం మండలవ్యాప్తంగా మంజీరా పరీవాహక ప్రాంతం, వనదుర్గా ఆయకట్టు, హల్దివాగు ఆయకట్టుతోపాటు కొన్ని గ్రామాల్లో భూగర్భ వనరులైన బోరుబావుల కింద మెరుగైన సాగునీటి వసతి ఉండడంతో ప్రధానంగా వరి సాగు చేస్తుంటారు. వరిసాగులో ప్రధానం నాట్లు వేయడం. మిగతా పనులు మందులు, మిషన్లతో చేస్తుంటారు. వరినాట్లు వేసేందుకు కూలీల సంఖ్య ఎక్కువ అవసరమవుతుంది. ఇటీవల కూలీల కొరతతో కొన్ని ప్రాంతాల్లో బీహార్ కూలీలతో వరినాట్లు వేస్తున్నారు. కాగా వరినాటులో ఆధునిక పద్ధతులను అవలంబించడంతో కూలీల కొరత నివారించడంతోపాటు వరినాట్లు వేయవచ్చు. వరినాటు యంత్రం కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.
నారును ట్రేలల్లో పెంచాలి
వరినారును ట్రేలల్లో లేదా పాలిథిన్ కవర్లపై పెంచాలి. ఎకరా నాటు వేసేందుకు దాదాపుగా 80-100 ట్రేలు అవసరం అవుతాయి. ఒక్క ట్రేకు 150 గ్రాముల విత్తనం చొప్పున ఎకరాకు 12-15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తనాలను సీడింగ్ మిషన్(విత్తనాలు వేసే యంత్రం) ద్వారా ట్రేలలో విత్తుకోవాలి. ట్రేలలో 4కిలోల మట్టి నింపి సుమారుగా 4 గ్రాముల అన్నభేది, 8 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బండిజమ్ కలుపుకొంటే పోషక సమస్యలు, రోగాలు రాకుండా నారు దృఢంగా పెరుగుతుంది. అవసరాన్ని బట్టి 0.5 నుంచి 1 గ్రాము యూరియా లీటర్ నీటికి కలిపి 3-5 రోజుల వ్యవధితో ప్రతి ట్రేకు రెండు/మూడుసార్లు పిచికారీ చేయాలి. పాలిథిన్ కవర్పై పెంచిన నారుమడిలో జింక్, ఇనుప ధాతు- పొట్ట లోప సవరణకు 2 గ్రాముల అన్నభేదిని 10లీటర్ల నీటితో కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ లోప నివరణకు 10లీటర్ల నీటికి 5గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మిషన్తో వేసే నారుమడి సుమారు 10-15 రోజుల వయస్సు ఉంటే సరిపోతుంది. ముందుగా పొలాన్ని ఆఖరు దమ్ము చేసి నాటుకు సిద్ధంగా ఉంచాలి. పొలంలో అవసరం మేరకు ఎరువులు వేసుకోవాలి.
కూలీల సమస్య ఉండదు
వరినాటు వేసే పొలాన్ని ఆఖరు దమ్ము చేసుకుని సిద్ధంగా ఉంచాలి. ట్రేలలో, పాలిథిన్ కవర్పైన పెంచిన వరినారును తీయడానికి ఒక మనిషి అవసరం అవుతుంది. వరినాటు యంత్రం నడిపేందుకు ఇద్దరు మనుషులు అవసరం అవుతారు. ఆ యంత్రంతో రోజుకు ఆరు ఎకరాల వరకు నాటు వేయవచ్చు. ఎకరం వరినాటుకు రెండు లీటర్ల పెట్రోలు అవసరం అవుతుంది.
ఏటా కూలీల కొరతతో నాటు ఆలస్యం అయ్యేది..
కొల్చారంలో నాకు పొలం ఉంది. కోతుల బెడదతో వరి పంటనే సాగు చేస్తుంటాను. సాగునీటి సమస్య ఉండడంతో ఆలస్యంగా నారు పోయడంతో అందరూ వరినాట్లు వేసే సమయంలో కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వ్యవసాయ అధికారుల సూచనలతో వరి నాటు యంత్రాన్ని కొనుగోలు చేశాను. మిషన్తో ఆదివారం ఒకేరోజు ఐదు ఎకరాలు నాటు వేశాను. అయితే వరినాటు యంత్రం ఉపయోగించాలంటే వరినాటును ట్రేలలో లేదా పాలిథిన్ కవర్పైన పెంచాలి. కొద్ది జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు లేకుండా వరినాట్లు వేసుకోవచ్చు.
– వంశరాజుల నర్సింహులు