రామాయంపేట, జూన్ 24: రామయాంపేటతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం పొద్దంతా మబ్బులు పట్టి ఉండి, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రామాయంపేటలోని అక్కల బస్తీలో డ్రైనేజీలపై మూతలు లేక వర్షం నీరు ఇండ్లలోకి చేరింది. స్థానిక జాతీయ రహదారి, మెదక్ రోడ్డు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్డుతోపాటు కేసీఆర్ కాలనీలో నీటితో మడుగులు నిండాయి. ఆరుద్రలో భారీ వర్షం కురియడంతో ఇక తుకాలు వేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొల్చారంలో మోస్తరు
కొల్చారం, జూన్ 24: కొల్చారం మండల వ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. శనివారం కురిసిన వర్షంతో రైతులు పులకరించిపోయారు. యాసంగి ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల అకౌంట్లలో పడడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి మృగశిర కార్తె వచ్చిన నాటి నుంచి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడినప్పటికీ శనివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో విత్తనాలు విత్తుకునే పనిలో పడ్డారు.