పటాన్చెరు, జనవరి 18: సర్కారు బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం ఘనపూర్లో గ్లాండ్ ఫార్మా రూ.4కోట్ల సీఎస్సార్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సర్పంచ్ కావ్యాకాశిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు సీఎస్సార్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నాయన్నారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ ఏడాది ఏడువేల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారికి మోటివేషల్ క్లాసులతోపాటు టెన్త్ పరీక్షలకు ఉచిత పరీక్షా సామగ్రి అందజేస్తామన్నారు. ఘనపూర్ గ్రామంలో నూతన పాఠశాలను నిర్మించిన గ్లాండ్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యాన్ని, అధికారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా సీఎస్సార్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్యాకాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్ విఠలయ్య, ఎంఈవో పీపీ రాథోడ్, రాఘవేంద్ర, పాఠశాల హెచ్ఎం నాగేశ్వర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.