పటాన్చెరు, ఫిబ్రవరి 9: మైనార్టీ గురుకులాలతో విద్యా వెలుగులు విరజిమ్ముతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన చదువులకు కేంద్రాలుగా మైనార్టీ గురుకులాలు మారాయన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందజేసేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు వారిలో విద్యావికాసం కల్గిస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదివి జీవితంలో రాణించాలన్నారు. పటాన్చెరులో మైనార్టీ రెసిడెన్షియన్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈనెల 15 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు తమ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. నాణ్యమైన వసతులతో పాటు చక్కటి పోషకాహారాన్ని అందజేస్తున్నామన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యాబోధన ఉందన్నారు. ప్రిన్సిపాల్ హనమర్లిన్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదో తరగతిలో మైనార్టీల కోసం 60 సీట్లు, నాన్ మైనార్టీల కోసం 20 సీట్లు కేటాయించారన్నారు. మొదట దరఖాస్తులు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థులు tmreis.telangana.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, ముత్తంగి సర్పంచ్ ఉపేందర్ముదిరాజ్, మైనార్టీ నాయకులు మతిన్, బీఆర్ఎస్ పటాన్చెరు మండల అధ్యక్షుడు పాండు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం
పటాన్చెరు డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం 113 డివిజన్లో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్తో కలిసి పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను జేకే ఫెన్నార్ సంస్థ సహకారంతో రూ.25 లక్షలు ఖర్చుతో నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పూర్తి స్థాయిలో పనులు కావాలని ఆదేశించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, జేకే ఫెన్నార్ సంస్థ ప్రతినిధులు సర్వేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.