అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్తో 1922 గ్రామాలకు లబ్ధి చూకూరనుండగా.. ఇప్పటికే 872 గ్రామాలకు శుద్ధి చేసిన జలాలలను సరఫరా చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2048లో ఉండే జనాభా, అవసరాలకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని తీసుకొని, శుద్ధి చేసి చుట్టుపక్కల గల ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ఈ ప్లాంట్తో వచ్చే తరాలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయి.
గజ్వేల్, అక్టోబర్ 19: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆలోచనతో పుట్టిన మిషన్ భగీరథ పథకం గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద 2016, ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురుడుపోసుకున్నది. తెలంగాణలోనే మిషన్ భగీరథ పథకం ప్రారంభంతో దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్కు మంచి పేరు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొండపాక మండలం మంగోల్ వద్ద భారీ నీటిశుద్ధి ప్లాంట్ను రూ.1,212 కోట్లతో నిర్మించారు. ప్రతి ఏడాది 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలకు రోజూ పంపిణీ చేసే విధంగా నిర్మించారు. ఇప్పటికే 872 గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతానికి గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కొండపాక మీదుగా హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ స్టోరేజీ బోర్డు(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఫేజ్-1 పథకం పైప్లైన్కు గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారి పక్కన లింక్ చేసి గజ్వేల్ మండలం కొమటిబండ గుట్టపైన నిర్మించిన సంపులలోకి నీటిని మళ్లిస్తారు. అక్కడి నుంచి ట్యాంకుల్లోకి నీటిని పంపింగ్ చేసి గ్రామాల్లోని ఇండ్లకు శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీటిని రోజూ సరఫరా చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలోని 221 గ్రామాలు, జనగామ జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలోని 569 గ్రామాలు, సుర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి యూఎల్బీ పరిధిలోని రెండు మండలాల్లోని 47గ్రామాలకు అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో 35గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని ప్రతి రోజు సరఫరా చేస్తున్నారు. మొదటి విడతలో నాలుగు జిల్లాల పరిధిలోని 23మండలాల్లో 872గ్రామాలకు మల్లన్నసాగర్ నుంచి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు.
కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన మంచి నీటి శుద్ధి ప్లాంట్ నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో దాహర్తి తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. కొండపాక మండలం మంగోల్ వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నీటిని శుద్ధి చేసే ప్లాంట్ను నిర్మించారు. తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సరఫరా చేసేందుకు రెండు చోట్ల ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన 6మోటర్ల చొప్పున 12 మోటర్లను బిగించారు. ఇందులో ఒక్కోచోట నాలుగు మోటర్లను వినియోగిస్తున్నారు. మిగతావి అదనంగా స్టాండ్బై చేశారు. రూ.1,212కోట్ల వ్యయంతో చేపట్టిన ప్లాంట్తో ఆరు జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే వీలుంటుంది. ఇక్కడి నుంచి సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్, మెదక్, సూర్యపేట జిల్లాలకు నీటిని పంపిణీ చేయనున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి తీసుకున్న మంచినీటిని శుద్ధి చేసి 12 నియోజకవర్గాలైన గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్, తుంగతుర్తి, నకిరేకల్, నర్సాపూర్లోని 1,922 గ్రామాలకు రోజూ నీటిని సరఫరా చేసే వీలుంది. ప్రస్తుతం ఉన్న నీటి అవసరాలతోపాటు 2048లో ఉండే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అతిపెద్ద మంచినీటి ప్లాంట్ను ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుతో చేపట్టిన ఈ ప్లాంట్తో వచ్చే తరాలకు మంచినీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా నిర్మాణాలను చేపట్టారు.
గోదావరి జలాలను ముందుగా కొండపాక మండలం మంగోల్ కేంద్రానికి తరలించి అక్కడి నుంచి లకుడారం వద్ద నిర్మించిన జీఎల్బీఆర్(గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కు తరలిస్తారు. అక్కడి నుంచి ఎడమ, కుడి రెండు పాయలుగా నీటిని తరలిస్తారు. ఎడమ పాయ ద్వారా సిద్దిపేట, జనగాం, పాలకుర్తి, స్టేషన్ఘనపూర్లో కొంతభాగం, గజ్వేల్లో కొంతభాగం, కుడిపాయ నుంచి గజ్వేల్ మండలం అక్కారం పంపింగ్ స్టేషన్కు తరలిస్తారు. పంపింగ్ ద్వారా మెదక్ జిల్లా నర్సాపూర్, శామీర్పేట మండలం ఘన్పూర్, గజ్వేల్ మండలం కొమటిబండ, గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీ, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ సెగ్మెంట్లకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.