గజ్వేల్, ఏప్రిల్ 9: ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను మార్కెట్లలో కొనుగోలు చేయడం లేదు. రైతులు పొద్దు తిరుగుడును నిల్వచేసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు సిద్దిపేట జిల్లాలో నెలక్రితం ఏడు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
మొదట కేంద్ర ప్రభుత్వ వాటా కొనుగోలుకు అనుమతి రావడంతో ప్రారంభించారు. కేంద్రం వాటా పూర్తవడంతో మార్కెట్లలో ఇంకా రైతులు పండించిన పొద్దుతిరుగుడు గింజలు అమ్మకానికి సిద్ధ్దంగా ఉన్నాయి. వారం క్రితం నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు పంటను ఎలా అమ్ముకోవాలని దిగులు చెందుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 9,278 ఎకరాల్లో సాగు…
సిద్దిపేట జిల్లాలో 16వేల మంది రైతులు 9,278 ఎకరాల్లో ఈసారి పొద్దుతిరుగుడు పంట సాగుచేశారు. కేంద్రం వాటాగా 2,029 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేయాలని ఆదేశించింది దీంతో నెలక్రితం జిల్లాలో ఏడు కేంద్రాల్లో కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రం వాటా కొనుగోళ్లు పూర్తవడంతో ఆ కేంద్రాలను అధికారులు నిలిపివేశారు.
మొదట కేంద్రం వాటాను పూర్తిచేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ వాటా కొనుగోలు కోసం అధికారులు సమయత్తం అవుతారు. వారంరోజులుగా జిల్లాలో కొనుగోళ్లు నిలిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా కొనుగోలుకు అనుమతి రాకపోవడంతో అటు అధికారులు, ఇటు రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు.
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 240 మంది రైతుల నుంచి 2900 క్వింటాళ్లను సేకరించారు. మార్కెట్లో ఇంకా రైతులు అమ్మకానికి తెచ్చిన 1300క్వింటాళ్ల పొద్దు తిరుగుడు నిల్వ ఉంది. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.4,600 ధర నిర్ణయిస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు ధర రూ.6,760కు అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలను పంటను తెచ్చారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
ప్రభుత్వ అనుమతి రాగానే కొనుగోలు
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే రైతుల నుంచి పొద్దు తిరుగుడు కొనుగోలు చేస్తాం, కేంద్ర వాటా కోనుగోలు ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రం వాటా కొనుగోలుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేగంగా ప్రక్రియ పూర్త్తి చేస్తాం.
-క్రాంతి, మార్క్ఫెడ్ అధికారి, సిద్దిపేట
అప్పట్ల గిట్ల దినుసు ఆగలె..
నేను నాలుగెకరాల్లో పొద్దుతిరుగుడు పండించిన. చిన్నకోడూరులో అమ్ముదామంటే 300 మంది రైతుల ఎనుక నాది లైన్ ఉంది. అక్కడ బార్దాన్ దొరుకుత లేదు. సాటేం లేదు. మొగులు చూత్తే సల్ల పడ్డది. అవన్నీ కొన్నంక మనకాడికి వత్తది. ఆలోపు వానపడితే తడత్తది. సిద్దిపేట మార్కెట్లనన్న పోద్దామని ఇక్కడకు వచ్చిన. ఇక్కడ చూత్తే అట్లనే ఉన్నది. ఎక్కడి పొద్దుతిరుగుడు కుప్పలు అక్కడనే ఉన్నయి. షెడ్ల కింద పోస్తే వానొచ్చిన ఏం కాదనుకుంటున్న. కానీ, ఇక్కడ చూస్తే కుప్పలు బాగానే ఉన్నయి. కేసీఆర్ గవర్నమెంట్లల మూడుసార్లు తెచ్చిన. అప్పట్ల గిట్ల ఎప్పుడూ ఆగలె. ఎంబడెంబడి మాల్ పోయింది. ఇబ్బంది లేకుండే.
– ఇట్టవేయిన రాజేశం,రైతు, చిన్నకోడూరు
వెంటదెంట కొనుగోళ్లు చేయాలి
సిద్దిపేట మార్కెట్ల షెడ్లన్నీ పొద్దుతిరుగుడు కుప్పలతో నిండిపోయినయి. అన్నీ పట్టి రెడీగా ఉన్నాయి. వెంటవెంట కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. మిగ తా రైతులు, సార్లను తెలుసుకుంటే బార్దాన్ ఉంటలేదంటున్నరు. అన్ని సౌలత్లు కల్పించి కొనుగోళ్లు తొందరగా పూర్తి చేయాలి. వడ్లు కూడా మార్కెట్కు వస్తున్నాయి. జాగా లేక వాళ్లు బయట పోస్తున్నరు. ఒకవేళ వానస్త్తే తడిసిపోతాయి. పట్టిన వాళ్లయి తీసుకోవాలి.
-రమేశ్, రైతు, గట్లమల్యాల, నంగునూరు మండలం