మెదక్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మెదక్ జిల్లాలో నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు గత నెల 26 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. రైతుల నుంచి శరవేగంగా ధాన్యం కొనుగోలు చేసినటు పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.
మరో వారం, పది రోజుల్లోగా పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో గన్నీ సంచులు, లారీల కొరత వంటి కొన్ని సమస్యలు ఎదురైనా అందరి సహకారంతో వాటిని అధిగమించామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కేంద్రాలకు తేవడం, మిల్లు యజమానులు, హమాలీలను ఎకువగా పెట్టుకుని దించుకోవడం, కేంద్రం నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఇది సాధ్యమైందన్నారు. స్థలాభావంతో శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్, చేగుంట, వెల్దుర్తి మండలాల ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించామన్నారు.
మిగతా ధాన్యాన్ని గతంలో మాదిరే గోదాంలు, ఇతర ప్రైవేట్ ప్రాంతాల్లో నిల్వ చేశామన్నారు. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ, మారెటింగ్, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 56,658 మంది రైతుల నుంచి రూ.571 కోట్ల విలువ గల 2 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాలో రూ.228 కోట్లు వేశామని రమేశ్ తెలిపారు. ఇంతవరకు 90 శాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, మిగతాది త్వరితగతిన పూర్తి చేసి డబ్బు జమచేస్తామన్నారు.