పచ్చని పంటపొలాలు..రైతుల ముఖంలో నవ్వులు.. సముద్రాన్ని తలపించే రిజర్వాయర్..నీటితో కళకళలాడుతున్న చెక్డ్యామ్లు,చెరువులు.. సస్యశ్యామల నేలను చూసి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ ముగ్ధుడయ్యాడు. పల్లె, పట్టణానికి తేడాలేకుండా జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ ప్రాంత రైతులు ఏటా నాలుగు పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కుకోవడాన్ని స్వయంగా అన్నదాతల ద్వారా తెలుసుకుని ఆనందానికి లోనయ్యాడు. గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ ఆ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. పర్యటన విజయవంతంగా కొనసాగింది. మర్కూక్ కొండపోచమ్మ రిజర్వాయర్, పంప్హౌస్, నర్సన్నపేట చెక్డ్యామ్, గజ్వేల్ పాండవుల చెరువును సీఎం సందర్శించారు. తెలంగాణ అధికారులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ తరహా సంస్కరణలు, విధానాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని మీడియాకు వెల్లడించారు. తెలంగాణ సాగునీటి విధానాలు, వ్యవసాయం దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు.
గజ్వేల్/గజ్వేల్ రూరల్/మర్కూక్, ఫిబ్రవరి 16 : జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ పర్యటన విజయవంతంగా సాగింది. రిజర్వాయర్లు, ఇక్కడి పంట పొలాలు, అభివృద్ధి చూసి పంజాబ్ సీఎంతో పాటు అక్కడి అధికారుల బృందం ఫిదా అయ్యింది. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ కొండపోచమ్మ రిజర్వాయర్, పంప్హౌస్, గజ్వేల్ పాండవుల చెరువును పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్మాన్, సీఎం ఓఎస్డీ కార్యదర్శులు రాజ్బీర్సింగ్, దీపక్ రోహెల్లాతో పాటు పంజాబ్ ఇరిగేషన్,వ్యవసాయ శాఖల అధికారులు సందర్శించారు. వారికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ హరిరామ్, కాళేశ్వరం ఎస్వేణు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ గురించి వివరించారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ నుంచి తనివి తీరా తిలకించి…
గురువారం ఉదయం 10.30 గంటలకు మర్కూక్లోని కొం డపోచమ్మ రిజర్వాయర్కు చేరుకున్న పంజాబ్ సీఎం భగవంత్మాన్, ఆ రాష్ట్ర అధికారులకు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ వేణు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పంజాబ్ సీఎం ఆ రాష్ట్ర అధికారులతో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్ డెలివరి సిస్టర్న్పైకి చేరుకుని ప్రాజెక్టును వీక్షించారు. ఈఎన్సీ హరిరామ్ కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం, నీటి పంపింగ్ విధానం, నీటి నిల్వ, చెరువులు కుంటల్లోకి కాలువలు, చెక్డ్యామ్ల ద్వారా నీటి విడుదల గురించి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాల గురించి పంజాబ్ సీఎంకు అధికారులు వివరించారు. కొండపోచమ్మ పంప్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన చిత్రమాలిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు నీటి తరలింపు, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా చెరువులు, కుంటల్లోకి నీటి విడుదల గురించి, హైదరాబాద్కు తాగునీటి సౌకర్యం తదితర అంశాల గురించి రజత్కుమార్ క్షుణ్ణంగా వివరించారు. పంప్హౌస్ లోపల మోటర్లను, వాటి పనితీరును పంజాబ్ సీఎం భగవంత్మాన్ చూసి, అడిగి తెలుసుకున్నారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ స్థాయిల్లో నిర్మించిన రిజర్వాయర్ల గురించి రజత్కుమార్ సీఎంకు వివరించారు. ప్రాజెక్టు గురించి తెలుసుకున్న పంజాబ్ సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మా వద్ద భూగర్భ జలాలు అడుగంటాయి : సీఎం
అనంతరం ఎర్రవల్లి-నర్సన్నపేట మధ్య గల చెక్డ్యామ్కు చేరుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, నర్సన్నపేట సర్పంచ్ మాధవి రాజిరెడ్డి, రాంచంద్రం తదితరులు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగ తం పలికారు. కూడవెల్లి వాగుపై ఉన్న నర్సన్నపేట చెక్డ్యాం నిర్మాణం, ఈ చెక్డ్యాం ద్వారా కొనసాగుతున్న డ్రిప్ ఇరిగేషన్ సాగు గురించి రాష్ట్ర నీటిపారుదల శాఖ పత్యేక కార్యదర్శి రజత్కుమార్ వివరించారు. గతంలో తాగు,సాగునీటి సమస్యతో ఎండిపోయిన చెరువులు, బీడుపోయిన భూములు, ఇప్పటి అభివృద్ధి జలవనరులు, భూగర్భజలాలు, పంటలసాగు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. అనంతరం మరోసారి పంజాబ్ సీఎం విలేకరులతో మాట్లాడారు. తమ ప్రాం తంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయాయని, ఐదునదులు కలిసిన ప్రాంతంగా పేరుపొందిన మా రాష్ట్రంలో ఇప్పుడు పెట్రోల్ తవ్వినట్టుగా బాగా లోతుకు బోరు వేస్తే కానీ భూగర్భజలాలు రావడం లేదన్నారు. దేశంలోని ఎఫ్సీఐ వద్ద ధాన్యం నిల్వలు భారీగా పెరిగిపోయాయని, కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాలకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నదని చెప్పారు. అందుకే అధిక ధరలు పొందేలా రైతులను ఇతర పంటలు పండించేందుకు కొత్త వ్యవసాయ విధానాలను తయారు చేసి, ఆ వైపుగా రైతులను మరల్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
పాండవుల చెరువు వద్ద రైతులతో సమావేశం..
గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్, ఆ రాష్ట్ర అధికారులు చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు శాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పాండవుల చెరువు మినీట్యాంక్బండ్పై రైతులు, స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గజ్వేల్ పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిన కృషి గురించి మున్సిపల్ చైర్మన్ వివరించారు. అనంతరం నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల అభివృద్ధి తదితర అంశాల గురించి వివరించారు. చెరువులు, కుం టలు అభివృద్ధి చేయడంతో పెరిగిన ఆయకట్టు, పంటల సాగు గురించి రైతులతో మాట్లాడి పంజాబ్ తెలుసుకున్నారు. పలువురు రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తమ ప్రాంతంలో పెరిగిన భూగర్భజలాలు, పంటల సాగు గురించి వివరించారు.
ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్మాన్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు, వ్యవసాయం, సాగు, తాగునీటి వనరుల అభివృద్ధి చాలా గొప్పగా జరిగిందన్నారు. తమ ప్రాంతంలోనూ నీటి వనరులు బాగా తగ్గిపోయాయని, రైతులను వరి, గోధుమ పంటలు కాక ఇతర వాణిజ్య, అధికధర వచ్చే పంటలను సాగుచేయాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడిలాగే తమ వద్ద కూడా నీటివనరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమం చాలా బాగుందన్నారు. కార్యక్రమాన్ని పంజాబ్లో త్వరలో అమలు చేస్తామని తెలిపారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని, మొదట ఢిల్లీలో బస్తీ దవాఖానలను ప్రారంభించామని, తెలంగాణలో ఇక్కడి సర్కారు సైతం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఇరిగేషన్ ఈఈ బాలా జీ, డీఈ మోతియా, క్వాలిటీ కంట్రోల్ డీఈ కిరణ్, ఏఈ లు శ్రీకాంత్, సాయి, హిమసారస, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండపాక వైస్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, స్థానిక కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, బొగ్గుల చందు, నాయకులు నర్సింగరావు, ఆయా విద్యుత్, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొండపోచమ్మ సాగర్ పంప్హౌస్లోకి కాళేశ్వరం జలాలు వచ్చే విధానాన్ని పంజాబ్ సీఎం
భగవంత్సింగ్ మాన్కు వివరిస్తున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ హరిరామ్
నీటి వనరులతోనే అభివృద్ధి పంజాబ్ సీఎం భగవంత్మాన్
కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పంజాబ్ సీఎం మాన్ విలేకరులతో మాట్లాడుతూ.. దేశం బాగుండాలంటే నీటి వనరులు పుష్కలంగా ఉండాలన్నారు. తెలంగాణలో నీటి వనరులను అభివృద్ధి చేయడంతో వివిధ రకాల పంటలను రైతులు అద్భుతంగా పండిస్తున్నారన్నారు. దేశం అంటే మరేమిటో కాదని గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం భారతదేశాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. భారతదేశమంటే వ్యవసాయం, గ్రామాలేనన్నారు. పంజాబ్ దేశానికి సీడ్ ఆఫ్ బౌల్గా పేరుపొందిందని, ప్రస్తుతం పంజాబ్లో నీటి వనరులు బాగా తగ్గిపోయాయన్నారు. తమ వద్ద ప్రాజెక్టులు, కాలువలు,నదులు, చెరువులు ఉన్నా, నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా పాతబడి పోయిందన్నారు. నవీన పద్ధతిలో తమ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించేందుకే ఇక్కడి పర్యటనకు వచ్చామని తెలిపారు. సేద్యం చేసి ధాన్యం పండించే రైతు బిచ్చమెత్తుకునే పరిస్థితి రావొద్దని, రైతుకు అండగా అందరూ ఉండాలన్నారు.తెలంగాణలో ఇటు జలవనరుల అభివృద్ధి, అటు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని అభినందించారు. తమ రాష్ట్రంలో భూగర్బజలాల మట్టం బాగా తగ్గిపోయిందని, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు అద్భుతంగా వృద్ధి చెందడమే కాకుండా రైతులు బంగారు పంటలు పండించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేందుకు తమ అధికారులతో ఇక్కడి ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
గజ్వేల్లో ఘనస్వాగతం
గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 16: సిద్దిపేట జిల్లా గజ్వేల్కు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్కు గురువారం ఘనస్వాగతం లభించింది. పట్టణంలోని పాండవుల చెరువు సందరీకరణను చూసేందుకు విచ్చేసిన సీఎం మాన్కు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం రైతులతో ముఖాముఖీలో పాల్గొన్న సీఎం భగవంత్సింగ్ మాన్ వారితో మాట్లాడారు. వ్యవసాయం రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాగు విధానాలు, రైతుల ఆదాయం, తదితర అంశాల గురిం చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రైతు పోచయ్య నాగలి బహూకరించి సన్మాంచడంతో సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో విజయవంతంగా అమలువుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను మున్సిపల్ చైర్మన్ రాజమౌళి హిందీలో తెలియజేశారు. రైతులు తమ అభిప్రాయలను తెలుపగా, హిందీలో రాజమౌళి అనువాదం చేశారు.
కాళేశ్వరం నీళ్లతో ఊటలు పెరిగాయి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో కాల్వల ద్వా రా నీళ్లను చెరువులకు మళ్లించారు. కాళేశ్వరం నీళ్లతో బో ర్లు, బావుల్లో ఊటలు పెరిగి నీళ్లు ఎక్కువయ్యాయి. ఇప్పు డు వరి పండించుకోవడానికి ఎలాంటి సమస్య లేదు. 24 గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేసి రైతులను ఆదుకున్నారు. రైతు బాగుంటే పట్నం బాగుంటుంది. గతంలో 500 ఫీట్లు వేస్తే బోర్లలో నీళ్లు రాలేదు. కాళేశ్వ రం ప్రాజెక్టు అయిన తర్వాత 100ఫీట్లు బోరు ఏస్తే నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. తెలంగాణలో రైతులకు పంటలే ఆదాయవనరు. కేసీఆర్ రైతుల కోసం ప్రాజెక్టులు కట్టించి ఆదుకున్న దేవుడు.
– కుమ్మరి పోచయ్య, రైతు, గజ్వేల్
తెలంగాణ వచ్చినంకనే మంచిగుంది..
తెలంగాణ వచ్చినంకనే సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. ఎరువులు, విత్తనాలు సమయానికి అందడంతో పంటలు సాగుచేస్తున్నాం. ప్రభుత్వం రైతులకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి. రైతులకు దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేసి కేసీఆర్ దేశంలోనే మహానేతగా పేరుతేచ్చుకున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయడంతో ఆయకట్టు కింద బోర్లలో నీళ్లు పుష్కలంగా పెరిగాయి.
– వెంకట్గౌడ్, రైతు, గజ్వేల్