మెదక్, సంగారెడ్డి జిల్లా నెట్ వర్క్, జూలై 21 : పాలు, అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా సామాన్యులు గళాన్ని వినిపించారు. ‘పిల్లలకు పాలు కూడా దొరకనివ్వరా’ అంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. ఇది అత్యంత దుర్మార్గపు నిర్ణయమని, పన్నుల పేరిట ప్రజలను నిండా ముంచుతున్నారని, బీజేపీ దోపిడీకి నిదర్శనమని మండిపడ్డారు. జీఎస్టీని రద్దు చేయాలని, లేదంటే మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
చాలా కష్టాలు..
పాలు, పెరుగు, పన్నీరు, చాక్లెట్లు ఇలా చిన్నపిల్లలు తినే ఎన్నో రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. జీఎస్టీతో పాటు గ్యాస్ ధరలను పెంచింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలతో సామాన్యుల బతు కు భారంగా మారుతున్నది. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలు ఏమీ కొనలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. -ఎర్రోళ్ల సువర్ణ, కవేలి(కోహీర్ మండలం)
ధరలు ఆకాశానంటుతున్నాయి..
రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉన్నది. ఒకప్పుడు మార్కెట్కు వెళితే నెలరోజులకు సరిపడా తినుబండారాలు తెచ్చుకునేవాళ్లం. కానీ ఇప్పుడు కనీసం వారం రోజులకు కూడా సరిపడా వస్తువులను కొనలేక పోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
–సార్గు భాగ్యమ్మ, రాయిలాపూర్ (రామాయంపేట)
బతకలేని పరిస్థితి ..
ధరల పెరుగుదలతో పేదోడు బతకలేని పరిస్థితి. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారింది. తినే తిండి మీద కూడా జీఎస్స్టీ వసూలు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఏమి చేస్తుండో తెలియని పరిస్థితి. మోదీతో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. బీజేపీ కేంద్ర పాలనలో పేదోడి బతుకు ఆగమైతున్నది.- నిర్మలరెడ్డి గృహిణి, ఎల్ఐజీ, ఆర్సీపురం
పన్నుల భారం తగ్గించాలి
కేంద్రం పన్నుల భారం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పవు. పన్నుల భారం వల్ల తినడానికి తిండికూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం వినియోగించే సరుకులపై జీఎస్టీ వేయడం సరికాదు. కేంద్రం పన్నుల భారాన్ని తగ్గించాలి.. లేకుంటే తగిన గుణపాఠం చెబుతాం.
– కొత్త స్రవంతి, కాట్రియాల రామాయంపేట
పేదోళ్లపై భారం ..
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలతో మాలాంటి పేద కుటుంబాలకు తీవ్రఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేకపోవడంతోనే ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నది. దీంతో సామాన్యుడిపై పెను భారం పడుతున్నది. నిత్యం ప్రజలు వినియోగించే పాలు, పెరుగు, బియ్యం, పప్పు దినుసులపై జీఎస్టీ వేయడం సిగ్గుచేటు. – శంశోద్దీన్-బుసారెడ్డిపల్లి, (మునిపల్లి మండలం)
అవగాహన లేకనే..
దేశాన్ని పాలించే శక్తి ప్రధానమంత్రి మోదీకి లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండేలా పాలించాలి. నిత్యం వినియోగించే సరుకులపై జీఎస్టీ వేయడం సరికాదు. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. – సురేశ్, బుసారెడ్డిపల్లి, (మునిపల్లి మండలం)