సిద్దిపేట అర్బన్, మార్చి 5: సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 23 ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు. అంతకుముందు గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల కోసం ఎంపీ డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుంచి గుర్తింపు కార్డులను సేకరించి డాటా కరెక్షన్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి సంబంధిత గుర్తింపు కార్డులు సేకరించి, నిర్దేశిత సమయంలోగా అవసరమైన వారి డాటా సరి చేస్తామని తెలిపారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హత గల గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, గ్యాస్ పాస్ బుక్లతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ గరీమాఅగ్రవాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.