అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా పాలన కార్యక్రమం అమలుపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలనలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అధికారులు నిబద్ధ్దతతో పని చేయాలన్నారు. ప్రభుత్వ వాగ్ధానాల అమలులో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 25 : ప్రభుత్వ పథకాలు అర్హులకే అందించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. నాయకుల తత్వం, గుణం వేర్వేరుగా ఉంటుందని, కానీ సిస్టం అనేది ఒకేవిధంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటి ఆచరణ, వాటిని అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వానికి, పరిపాలనకు అధికారులు గుండె లాంటివారని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అర్హులకు అందజేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని గుర్తు చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామసభల్లో దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రజాపాలన నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లను మం త్రికి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చం ద్రశేఖర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.