రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్( Rayapol ) పోలీస్ స్టేషన్ను శుక్రవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్( CP Rashmi Perumal ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు నమోదు, ఆయుధాల భద్రత, మాల్ఖానా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు సత్వర, పారదర్శక పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో సమావేశమై వారి పనితీరు, సమస్యలపై ఆరా తీశారు. శిధిలావస్థ భవనంలో ఉన్న పోలీస్ స్టేషన్ కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కొత్త భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.