జహీరాబాద్, ఫిబ్రవరి 24 : హైకోర్టు ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ మండలం కొత్తూరు (బీ)లో ఉన్న ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
రెవెన్యూ రికవరీ చట్టం WP.NO/ 229/2024 తేది 4-1-2024 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2023 క్రషింగ్ సీజన్లో పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు రూ. 9,01,06,341 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. నోటీసులకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆస్తులను బహిరంగ వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ నెల 28న ఫ్యాక్టరీకి చెందిన 41.07 ఎకరాల భూమి, యంత్రాలను వేలం వేయనున్నట్లు తెలిపారు.