సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంతో తెలంగాణ పచ్చలహారంగా మారిందని సీఎంవో ఓఎస్డీ, ఐఎఫ్ఎస్ ప్రియాంకా వర్గీస్ అన్నారు. తూప్రాన్ మండలం దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్లలో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి, సంపద, బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. గ్రామాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కులు నాటాలని సూచించారు. మొక్కలకు నీటిని అందించేందుకు వర్షం నీటిని నిల్వ చేసుకుని భద్రపరుచుకోవాలన్నారు.
తూప్రాన్, జూలై 13: తూప్రాన్ మండలంలోని దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్లలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, సంపద వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని సీఎంవో ఓఎస్డీ, ఐఎఫ్ఎస్ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం తూప్రాన్ మండలంలోని దాతర్పల్లిలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, గుండ్రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సంపద వనాన్ని, మల్కాపూర్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ఆమె సందర్శించారు. సీఎంవో ఓఎస్డీకి మెదక్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎఫ్వో రవి ప్రసాద్ స్వాగతం పలికారు. ముందుగా దాతర్పల్లిలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, చాలా బాగుందని కితాబిచ్చారు. మొక్కలకు నీటిని పట్టేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి నిల్వ చేసుకునే బదులు, ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి జారువాలే వర్షం నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.
అనంతరం గుండ్రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సంపద వనాన్ని పరిశీలించి, అక్కడ వేప మొక్క నాటారు. అనంతరం మల్కాపూర్ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని, డంపింగ్ యార్డును, ఆటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తిని వ్యకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంతో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని, అనతికాలంలోనే రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందన్నారు. సంపద వనాలలో వేప, టేకు వంటి చెట్లను పెంచడం ద్వారా పంచాయతీలు సంపదను సృష్టించుకోవచ్చాన్నారు. గ్రామాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ఖాళీలు లేకుండా మొక్కలు నాటాలని, మరిన్ని బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి, పీఆర్ డీఈ నర్సింలు, దాతర్పల్లి సర్పంచ్ నర్సమ్మ, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ శ్రీలత రాజిరెడ్డి, మల్కాపూర్ సర్పంచ్ మహాదేవి నవీన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, అటవీ శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.