“మంత్రి పదవి హుస్నాబాద్ ప్రజలు పెట్టిన భిక్ష” అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అందుబాటులో ఉండి సేవకుడిలా పనిచేస్తానన్నారు. హుస్నాబాద్కు వచ్చిన ప్రియాంకాగాంధీ మెడికల్ కళాశాల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని వందశాతం నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
హుస్నాబాద్, డిసెంబర్ 11: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్షగా మంత్రి పదవి తనను వరించిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపితే పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందుబాటులో ఉండి సేవకుడిలా పనిచేస్తానన్నారు. సోమవారం రాత్రి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అనభేరి క్రాసింగ్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో మంత్రితోపాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్లెచెట్టు చౌరస్తా, మెయిన్రోడ్డు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. అక్కడ జరిగిన సభలో పొన్నం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్కు వచ్చిన ప్రియాంకగాంధీ ఇక్కడికి మెడికల్ కళాశాల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని వందశాతం నిలబెడతానని స్పష్టం చేశారు. గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ల గురించి ఇరిగేషన్ మంత్రికి ఇప్పటికే వివరించానని, రూ.250కోట్ల నిధులతో కాల్వలు పూర్తి చేయించి సాగునీరందించేందుకు కృషి చేస్తానన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
రాజకీయాలతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, హుస్నాబాద్లోని పార్టీ కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా వినతులు స్వీకరించేదిగా ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానికుడిని కాకపోయినా తనపై నమ్మకంతో హుస్నాబాద్ ప్రజలు గెలిపించారని, స్థానికంగా ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేసి విధేయుడిగా ఉంటానని చెప్పారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, ఎండీ హసన్, బంక చందు, మంజులారెడ్డి, మడప జయపాల్రెడ్డి, చిత్తారి రవీందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు గడిపె మల్లేశ్, గూడెం లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.