కంది, ఏప్రిల్ 18: సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఇజ్మల వెంకట్(39) గంజాయి కేసులో నిందితుడిగా ఈనెల 3న కంది సెంట్రల్ జైలుకు వచ్చాడు. 17న గురువారం రాత్రి అతడికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు.
మళ్లీ అర్ధరాత్రి కింద పడిపోవడంతో పరీక్షించిన జైలు వైద్యులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం ఖైదీ మృతికి గుండెపోటు కారణమా, మరేదైనా కారణమా అనే విషయం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వెంకట్ మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి దవాఖాన వద్దకు చేరుకున్న వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మృతదేహం వద్దకు తమను ఎందుకు పంపడం లేదని, మృతిపై అనుమానం ఉందన్నారు. ఒకరోజుముందు ములాఖాత్లో వెంకట్ను కలిసి మాట్లాడామని, ఆరోగ్యంగా ఉన్నాడన్నారు.