పటాన్చెరు, జనవరి 10 : జీహెచ్ఎంసీ డివిజన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మూడు డివిజన్లలకు 5 స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 113వ డివిజన్ పటాన్చెరుకు 2 ఆటోలు, 112వ డివిజన్ రామచంద్రాపురానికి 2 ఆటోలు, 111వ డివిజన్ భారతీనగర్కు 1 ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్కు, భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డికి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్కు ఆటో తాళాలను ఎమ్మె ల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు 87 స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెత్త సేకరణ ఆటోలు, రిక్షాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ చెత్త వేయొద్దని సూచించారు. చెత్తను తడి, పొడిగా ఇవ్వడంతో అందరి ఆరోగ్యాలకు మేలు జరుగుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అవసరమైతే మరిన్ని ఆటోలు తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మెడికల్ ఆఫీసర్ రంజిత్, టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం..
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే సీఎం రిలీఫ్ ఫండ్స్ను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, పృథ్వీరాజ్, కునాల్ తదితరులు పాల్గొన్నారు.