మెదక్, (నమస్తే తెలంగాణ)/ వెల్దుర్తి, ఫిబ్రవరి 26 : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం శుభపరిణామమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు. మెదక్ కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మెదక్ రైల్వే స్టేషన్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ.16 కోట్లు కేటాయించారని, దీంతో జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వికసిత భారత్ కార్యక్రమంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
మెదక్ ప్రజల దశాబ్దాల కోరిక మెదక్ రైల్వేస్టేషన్ అని, ఇందుకోసం మెదక్ రైల్వే సాధన సమితి నాయకులతో పాటు ఎంతోమంది ఎన్నో రకాలుగా శ్రమించారని, వారి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ శేరి సుభాష్ర్రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మెదక్ స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.15 కోట్లు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మెదక్ రైల్వేస్టేషన్ మరింత అభివృద్ధి చెందాలంటే మెదక్ నుంచి మనోహరాబాద్ వరకు రైలుమార్గం వేయాలన్నారు. భవిష్యత్తులో మనోహరాబాద్ రైల్వే జంక్షన్గా ఏర్పడే అవకాశం ఉన్నందున హైదరాబాద్ నుంచి సమీప పట్టణ ప్రాంతాలకు పుష్పుల్ రైళ్లు నడిపించి, మెదక్ అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్సీ రైల్వే అధికారులను కోరారు. ఈ ప్రతిపాదిత మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి నిజామాబాద్-నాందేడ్కు దూరంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందని పేరొన్నారు. ఇప్పటికే సర్వే పూర్తయిన మెదక్ – పటాన్చెరు (వట్టినాగులపల్లి) వయా జోగిపేట సంగారెడ్డి రైల్వేలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సీనియర్ డీఈ శ్రీతేజ, అధికారులు రహమా, రాజు, ఏఎంవీఎల్ నర్సింహారావు, వినయ్, మెదక్ స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్, స్టేషన్మాస్టర్లు పద్మారావు, నవనీత్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్, మనోహరాబాద్ మండలం కూచారం, పాలాటలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రైల్వేక్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వడియారం రైల్వేస్టేషన్ మాస్టర్ సయ్యద్గౌసోద్దీన్, నాయకులు వేణుగోపాల్రెడ్డి, మోహన్రెడ్డి, బాలేశ్, రామస్వామి, సిద్దిరామ్లతోపాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తెరపై నరేంద్రమోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించారు.