జిన్నారం(పటాన్చెరు), ఫిబ్రవరి 4: ‘కాంగ్రెస్వి 420 హామీలు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేస్తుందని విమర్శించారు. వచ్చే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యకర్తలు ఏం బాధపడొద్దని, ఇది చిన్న స్పీడ్బ్రేక్ మాత్రమేనన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కేవలం ఐదేండ్లు ఉండి ఇంటికిపోయిందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1.8 శాతం అంటే నాలుగున్నర లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయామన్నారు. నిజం గడపదాటేలోపు అబ ద్ధం ఊరంతా తిరిగినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చే యాలని అడిగితే డేట్లు చెబుతున్నారని విమర్శించారు.
ఫిబ్రవరి 1న గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని, డిసెంబర్ 9 నుంచి కరెంట్ బిల్లులు కట్టొద్దని చెప్పారని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇప్పుడైతే రైతుబంధు రూ.10వేలు ఇస్తారు, కాం గ్రెస్ వచ్చిన తర్వాత రూ.15వేలు ఇస్తామని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడని, ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. జనవరిలో ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ను ఫిబ్రవరిలో ఇచ్చి జనవరి పెన్షన్ను ఎగ్గొట్టారన్నారు. రెండు లక్షల రుణమాఫీ అమలు సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మార్పు పేరుతో బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించి 6.50లక్షల ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఉపాధి కరువై 12 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఒక్క మంత్రి కూడా వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ సరఫరా చేస్తే కాంగ్రెస్ ప్రభు త్వం రెండు నెలలకే రోజుకు 15 నుంచి 16గంటల కరెంట్ ఇస్తుందన్నా రు. ఎంత ఒత్తిడి తెచ్చినా పదేండ్లలో ప్రాజెక్టులను కేంద్రానికి కేసీఆర్ అప్పజెప్పలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వస్తేనే ఇచ్చిన హామీలు ఇక్కడ అమలవుతాయని రేవంత్రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్కు దేశంలో 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూటమి నుంచి వెళ్లిపోయిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తే హర్షం వ్యక్తం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో నీటి సమ స్య పరిష్కరించామన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజే పీ, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు లాభం లేదని, బీఆర్ఎస్ని గెలిస్తేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాముడు అందరికీ దేవుడని, దీన్ని కూడా రాజకీయం చేస్తూ బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి 150 ఆలయాలు కట్టించాడని గుర్తుచేశారు. అనంతరం సమస్యల పరిష్కారానికి ఆటో డ్రైవర్లు హరీశ్రావుకు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ వి.భూ పాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, కే సత్యనారాయణ, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎఫ్డీసీ మాజీ వంటేరు ప్రతాప్రెడ్డి, గాలి అనిల్కుమార్, జడ్పీటీసీ కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ కొలనుబాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని ఎంపీ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలతో కలిసి అందరం పనిచేయాలి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని హామీలు గుప్పిస్తోంది. మెదక్ ఎంపీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గాలి అనిల్కుమార్ ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి స్థానిక ఎన్నికలకు గట్టిపునాదులు వేసుకుందాం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎవరికీ అన్యాయం జరగదు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా వారి బాధ్యత ఎమ్మెల్యే హరీశ్ అన్న తీసుకుంటాడు.
మెదక్ ఎంపీ ఎన్నికలు మనకు చాలా కీలకమైనవి . ఈ ఎన్నికల్లో అందరం సమష్టిగా పనిచేయాలి. ఎంపీ ఎన్నికలను పునాదిగా భావించి స్థానిక ఎన్నికలకు గెలుపు బాటలు వేసుకోవాలి. పదేండ్లలో గులాబీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో వేల కోట్ల అభివృద్ధిపనులు చేయించారు. కాంగ్రెస్ మోస పూరిత హామీలను ప్రజలు చాలా తొందరగా గుర్తించారు. ఆరు గ్యారెంటీల్లో రెండు మాత్రమే అమలు చేసి మిగిలినవి అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు అని సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు. తెలంగాణకు కేసీఆర్ రక్ష అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందరం కలిసికట్టుగా మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిపించుకుందాం.