సంగారెడ్డి కలెక్టరేట్, మే 16: పరిశుభ్రతతోనే దోమల వ్యాప్తి, డెంగ్యూని అరికట్టవచ్చని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి డీఎంహెచ్వో కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిపై ప్రజలు పూర్తి అవగాహన, అప్రమత్తంగా ఉండాలన్నారు.
నీరు నిల్వ, పారిశుధ్య లోపంతో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు వస్తాయని, దోమ తెరలు, నివారణ మందులతో రక్షణ పొందాలన్నారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వాడుకలో లేని వస్తువులని తీసేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. డెంగ్యూ నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, వైద్యులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.