చిన్నారుల మేధోశక్తిని పెంచేందుకు సర్కారు చర్యలు
పూర్వ ప్రాథమిక విద్య అమలుకు సన్నాహాలు
సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో 248 అంగన్వాడీ కేంద్రాలు
సదాశివపేట, జూన్24: చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఆడుతూ పాడుతూ నీతి కథలు వింటూ పాఠాలు నేర్చుకుంటున్నారు. మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూ, మేధోశక్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, హాంకాంగ్ తరహాలో ప్రీ స్కూల్ విద్యను అమలు చేస్తున్నది. అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నందున చిన్నారుల తల్లిదండ్రుల నుంచి సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో మొత్తం 248 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ప్రీ స్యూల్ విద్యను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.
పిల్లల కోసం ప్రత్యేక పుస్తకాలు
బాల్యంలో పిల్లలను భవిష్యత్తుకు అవసరమైన కార్యక్రమాలపై దృష్టి మళ్లిస్తే చిన్నారులు జీవితంలో వెనుదిరిగే అవకాశాలు ఉండవని ప్రభుత్వ ఆలోచన. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే విద్యారంగ నిపుణులు కూడా ఆయా దేశాల్లో పర్యటించి పూర్వ ప్రాథమిక విద్యపై అధ్యయనం చేసి రాష్ట్ర సర్కారుకు నివేదిక అందించారు. ఈక్రమంలో ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను ముద్రించి అంగన్వాడీ కేంద్రాలకు పంపించిన విషయం తెలిసిందే. కాగా, సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో 248 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మునిపల్లి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి మండలాలు సదాశివపేట ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. ఇందులో 3 నుంచి ఆరేండ్ల మధ్య 8,431 మంది చిన్నారులు ఉండగా, మూడేండ్ల పిల్లలకు ఐదు రకాలు, 4 నుంచి ఐదేండ్ల పిల్లల కోసం ఆరు పుస్తకాలు రూపొందించారు. ఐసీడీఎస్ యంత్రాంగం అందించే సిలబస్ ప్రకారం పిల్లలకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు.
బోధన ఇలా..
చిన్నారుల ప్రతిభను అంచనా వేసేందుకు ఇప్పటికే ప్రీస్కూల్ అసైన్మెంట్ కార్డులు తయారు చేసి కేంద్రాలకు పంపారు. మూడేండ్లు పైబడిన వారికి ఆకుపచ్చరంగు, నాలుగేండ్లు పైబడిన వారికి నీలిరంగు కార్డులిచ్చారు. ఈ క్రమంలో నిత్యం గణితబోధన, తెలుగు, అభ్యసన కరదీపిక, పరిసరాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు, ఇంగ్లిష్ వర్క్, బుక్కుల్లో చుక్కలు కలుపుతూ బొమ్మలు గీయడం, వస్తువులు చూసి పేర్లురాయడం, అక్షరాలు, అంకెలు క్రమం తప్పకుండా చదివించడం తదితర పద్ధతుల్లో బోధన చేయిస్తున్నారు. ఈ క్రమంలో పలు పరీక్షల ద్వారా నిర్ధారించి ఆకుపచ్చ, నీలిరంగు కార్డుల్లో నమోదు చేసి చిన్నారుల తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. వెనకబడిన చిన్నారులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నారుల్లో నెలకొన్న బుద్ధిమాంధ్యం మూలంగా చిన్నారుల ఆరోగ్యంపై దృష్టిసారించి వైద్యం అందించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే చిన్నారులకు పోషకాహారంతో పాటు బాలామృతం అందిస్తుండగా వారిలోని ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు అవసరమైన చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతున్నది.
ప్రీ స్కూల్ విద్య ఎంతో మేలు..
పిల్లల సంపూర్ణ అభివృద్ధి, మేధస్సు పెంపొందించడం, బడికి సంసిద్ధులను చేయడం ప్రీ స్కూల్స్ ముఖ్యఉద్దేశం. ప్రీ స్కూల్ విద్యతో చిన్నారులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లల్లో మెదడు శరవేగంగా అభివృద్ధి చెందే దశలో వారికి అవగాహనతో కూడిన విద్యను అందించాలి. దీని ద్వారా భవిష్యత్తులో వారికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. మేధోశక్తి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా విద్యా బోధన సాగుతుంది. ఆట పాటలతో విద్యనేర్పడం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతారు. – రేణుకా పట్టేటి, సీడీపీవో సదాశివపేట