గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ పట్టణానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. సభకు సంబంధించి గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మెదక్ నియోజక వర్గంలోని ఆరు మండలాల నుంచి సుమారు 50వేల మంది సభకు హాజరు కానున్నారు. పట్టణం గులాబీమయంగా మారింది.
మెదక్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ పట్టణం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్లో నిర్వహించనున్న సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న సందర్భంగా గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో సభాస్థలిని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వేదిక, వాటర్ ఫ్రూఫ్, 50వేల మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. కళా బృందాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో కూడా సీఎం సభ ఇదే స్థలంలో నిర్వహించారు. సీఎం హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు సభాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సుమారు 50 వేల మంది సభకు హాజరయ్యేందుకు రెండు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభకు పెద్దఎత్తున జనాన్ని తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్లో సీఎం వస్తుండడంతో సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో సభా స్థలి పక్కనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సహకరించారన్నారు. మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయాయని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో మెదక్లోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. సుమారు 50వేల మంది ఈ సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.