సుమారు రూ.16 లక్షల మోసం
ఆలస్యంగా వెలుగులోకి బ్రాంచ్ మేనేజర్ నిర్వాకం
అనంతసాగర్ పోస్టాఫీసులో ఘటన
చిన్నకోడూరు, జూన్ 7 : తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ డిపాజిట్లు కట్టుకున్నారు. ఇలా డిపాజిట్లు కట్టుకుంటూ.. ఆ సొమ్ము ఒకే సారి తీసుకుంటే.. ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుందని అనుకున్న ఖాతాదారులకు పెద్ద షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలమంది ఖాతాదారులు కట్టిన సొమ్మును ఆ బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీకాంత్ కాజేసిన వైనం చిన్నకోడూరు మండలం అనంతసాగర్ తపాలా కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టల్శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామానికి ..
అనంతసాగర్ తపాలా కార్యాలయంలో చర్లఅంకిరెడ్డిపల్లికి చెందిన తిమ్మాపురం శ్రీకాంత్ కొన్నేండ్లుగా బ్రాంచ్ పోస్టుమాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన పలువురు తమ పేరుతో ఆన్లైన్ అకౌంట్లు తెరచారు. రికరింగ్ డిపాజిట్ 415, సుకన్య సమృద్ధి యోజన 55, పొదుపు ఖాతా 71, తపాలా జీవిత బీమా 50 ఖాతాల్లో ప్రతి నెలా డబ్బులు దాచుకున్నారు. ఇలా పొదుపు చేసే సమయంలో ప్రతి నెలా పుస్తకాల్లో నమోదు చేసి ఖాతాదారులకు ఇవ్వాలి కానీ పోస్టుమాస్టర్ శ్రీకాంత్ పుస్తకాలు తనవద్దే ఉంచుకున్నాడు. కొందరి పొదుపు ఖాతాలు గడువు తీరినా వారి దగ్గర నుంచి సంతకాలు తీసుకొని డబ్బులు చెల్లించలేదు. పోస్టుమాస్టర్ దగ్గర ఉన్న ఖాతా పుస్తకాలకు సంబంధించిన డబ్బులను ఆన్లైన్లో నమోదు చేయలేదు.
పాసుపుస్తకాల్లోనే జమ
ఖాతాదారులు తమ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు మే 24వతేదీన సిద్దిపేటలోని హెడ్పోస్టాఫీసుకు వెళ్లారు. తమ పోస్టాఫీసు బుక్లో ఉన్న లావాదేవీలు ఆన్లైన్లో పొందుపర్చకపోవడంతో ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇక్కడే బిత్తరపోయే నిజాలు వెలుగుచూశాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
బ్రాంచ్ పోస్టుమాస్టర్ సస్పెండ్
ఖాతాదారుల పాసుపుస్తకంలో జమ చేసినప్పటికీ బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఆన్లైన్లో జమ చేయలేదని తపాలా ఉన్నతాధికారులు గ్రహించారు. వెంటనే తపాలాశాఖ ఉన్నతాధికారులు అనంతసాగర్ పోస్టు ఆఫీసుకు వెళ్లారు.పేదల సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించారు. సంబంధిత రికార్డులన్నీ సీజ్ చేశారు. తపాలా శాఖ ఉన్నతాధికారులు పోస్టు మాస్టర్ శ్రీకాంత్ను సస్పెండ్ చేశారు.
దాచుకున్న సొమ్ము కాజేసిండు
కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న సొమ్మును పోస్టుమాస్టర్ శ్రీకా ంత్ కాజేసిండు. తపాలా కార్యాలయంలో డబ్బులు దాచుకుంటే భద్రంగా ఉంటాయని భావిం చాం. నిరుపేదలైన మమ్ముల్ని నట్టేట ముంచిండు. పెద్ద సార్లు మాపై దయ ఉంచి మేము కూడబెట్టుకున్న సొమ్మును ఇప్పించాలి.
– చామకూర లక్ష్మి, అనంతసాగర్
బిడ్డ పెండ్లికని జమచేశా
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో ఆడ పిల్ల పెండ్లి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకని సుకన్య సమృద్ధిలో ఇద్దరు ఆడబిడ్డల పేరుమీద నెలకు వెయ్యి చొప్పున జమచేస్తున్నా. ఇప్పటి వరకు ఒక్కొక్కరి పేరుమీద రూ.86 వేలు తపాలాకార్యాలయంలో జమచేశా. ఇప్పుడు పోస్టుమాస్టర్ డబ్బులు కాజేసిండని తెలిసింది. ఏంచేయాలో అర్థంకావడం లేదు.
– ముక్కెర నర్సవ్వ, అనంతసాగర్