కోహెడ, జూన్ 29: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అన్నారు. సాగునీటి వసతుల పెరుగుదల , నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే వాడాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతికి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. వాతావారణ మార్పులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బోయిని నిర్మలాజయరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, సర్పంచ్ బండారి లక్ష్మి, నాయకులు మంద ధర్మయ్య, చేపూరి శ్రీశైలం, బందెల బాలకిషన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.