సంగారెడ్డి, అక్టోబర్ 21: విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివారం పోలీసు ప్లాగ్ డేను పురస్కరించుకుని జిల్లా పోలీస్ మైదానంలోని అమరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ ఎస్సై కరమ్ సింగ్ నాయకత్వంలోని 20మంది భారత జవాన్లు కలిసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, చైనా దొంగ దెబ్బతో దాడి చేసి 10మంది జవాన్లను హతమార్చిందన్నారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ రోజు (పోలీస్ ప్లాగ్ డే)గా పాటిస్తున్నామన్నారు.
ఈ సంవత్సరంలో దేశంలో విధినిర్వహణలో 189 మంది వీరమరణం పొందారని, వారందరికీ మనం శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు. దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు వీరమరణం పొందారని గుర్తుచేశారు. ఇందులో సిర్గాపూర్ పోలీస్స్టేషన్కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ స్టేషన్కు చెందిన ఎల్లయ్య, జిన్నారం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ, కంగ్టి పోలీసుస్టేషన్కు చెందిన సురేశ్ విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అశోక్, రాములు నాయక్, డీఎస్పీలు రమేశ్కుమార్, రఘు, పురుషోత్తం, వెంకట్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ జనార్దన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శివలింగం, విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, వెంకట కిశోర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఆర్ఐలు రాజశేఖర్, రామారావు, హన్మిరెడ్డి, జిల్లా సీఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.