సిద్దిపేట అర్బన్, ఆగస్టు 2 : ఈనెల 7న జరిగే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమావళి ప్రకారం పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో 4,544 మంది ఎస్సై అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేయాలన్నారు.
ఫర్నిఛర్, గాలి, వెలుతురు, నీటి వసతి కల్పించాలన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధ్దతిలో వేలి ముద్రలు తీసుకుంటామని, అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని తెలిపారు. నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షకు సంబంధించిన నిబంధలను హాల్టికెట్లో పొందుపర్చి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్లోని నిబంధనలు చదువుకోవాలని సీపీ సూచించారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు, మెహందీ వంటివి పెట్టుకోవడంతో బయోమెట్రిక్లో వేలిముద్రలు సరిగా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు సెల్ఫోన్, చేతి గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.
పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం
ఎంపిక విధానం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని సీపీ శ్వేత అన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. బయోమెట్రిక్ ఉపయోగించి పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒంటి గంట ముందే పరీక్షా కేంద్రాలను సందర్శించాలన్నారు. ఎవరైనా అభ్యర్థులు సెల్ఫోన్ తీసుకొని వస్తే భద్రపర్చడానికి గేటు ముందు ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మెయిన్ గేటు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు, చీఫ్ సూపరిండెంట్లు, అబ్జ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఇన్విజిలేట్లరకు మాత్రమే అనుమతి ఉందన్నారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కోఆర్డినేటర్, ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీపీ రాజు, నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు ఫణీందర్, రమేశ్, సతీశ్, సీఐలు భానుప్రకాశ్, రవికుమార్, భిక్షపతి, జానకీరాంరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్రెడ్డి, ధరణికుమార్ పాల్గొన్నారు.