సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 22 : సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 582 మంది అభ్యర్థులకు పరీక్షలు ఉండగా, 451మంది అభ్యర్థులు హాజరయ్యారు. 131 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. వీరిలో 227మంది అభ్యర్థులు అన్ని విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి, తుది పరీక్షకు అర్హత సాధించారు. ముందుగా జెండా ఊపి పరుగు పందాన్ని సీపీ శ్వేత ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచే అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి, ఎత్తు కొలిచి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చారు. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు లాంగ్ జంప్, షాట్పుట్ ఈవెంట్లను పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయంలో అంబులెన్స్, మెడికల్ బృందం, టాయిలెట్లు, మొబైల్ టాయిలెట్, మంచి నీటి సౌకర్యం వంటి సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో ఈవెంట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఆర్ఎఫ్ఐడీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు మహేందర్, రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి ఏఆర్ డీఎస్పీ జనార్దన్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.