మునిపల్లి, డిసెంబర్ 26: అనుమతి లేకుండా ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముంబయి జాతీయ రహదారిపై ఉన్న కంకోల్ టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ రఘురాం, జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి గాయ త్రి ఆదేశాల మేరకు చిరాగ్పల్లి, మునిపల్లి మండలాల్లోని కంకోల్ గ్రామ శివారులో గల దక్కన్ టోల్ప్లాజా వద్ద రూట్ వాచ్ నిర్వహించి, అంతర్రాష్ట్ర టూరిస్టు బస్సుల్లో సోదాలు చేసినట్లు తెలిపారు. టూరిస్టు బస్సుల్లో 120 మద్యం బాటిళ్లు (75.38 లీటర్ల వైన్, 2.65 లీటర్ల బీరు) స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమతులు లేకుండా మద్యం తరలిస్తే వారిపై పలు రకాల కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు మధుబాబు, రమేశ్రెడ్డి, సీతారాంరెడ్డి, ఎక్సైజ్ ఎస్సైలు హారిక, మురళి, శంకర్, రాము లు, అంజయ్య, శిరీష, విశ్వనాథ్, సిబ్బందిఉన్నారు.