పటాన్చెరు : హైదరాబాద్ నగర శివారు పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఫాంఫౌస్లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు. 32 కోళ్లు, 26 వాహనాలు పట్టుకున్నారు.
పక్కా సమాచారం మేరకు పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి నేతృత్వంలో ఎస్పీ రమణకుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామ శివారులోని ఒక ఫాంహౌస్పై పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పలువురు పరారయ్యారు. అయితే పరారైన వారిలో టీడీపీ నాయకుడు చింతమనేని కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా పట్టుబడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పరారైన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఈ కోడి పందాలు జరుగుతున్నాయనే విషయంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఫాంహౌస్ వద్దకు ఎస్పీ రమణకుమార్ చేరుకొని పరిశీలించారు. డీఎస్పీ, సీఐల వద్ద వివరాలు సేకరించారు. ఘటనాస్థలిలో రూ.13 లక్షలకు పైగా నగదుతో పాటు కార్లు, బైక్లు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.