మెదక్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణం మీదకొచ్చింది. ఏ కేసులో ఎవరిని తీసుకొచ్చి చితక బాదుతున్నారో తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో ఏదైనా కేసుల్లో విచారణ కోసం అనుమానంతో తీసుకొచ్చిన వ్యక్తులను పోలీసులు చితకబాదినా వారు ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి లేదు. తాజాగా ఇలాంటి ఘటన జిల్లా కేంద్రం లో జరిగింది. మహిళా మెడలో నుంచి బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు ఘోరంగా కొట్టారు. ఐదు రోజుల తర్వాత అతన్ని వదిలిపెట్టగా బాధితుడు జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తికి రెండు కిడ్నీలు పాడైపోయాయని వెంటనే హైదరాబాద్కు తరలించారు. గురువారం జిల్లా కేంద్ర దవాఖానలో బాధితుడు ఖాదీర్ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని అరబ్గల్లీలో జనవరి 27న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారం పుస్తెలతాడు చోరీచేశాడు. కేసు నమోదు చేసిన మెదక్ పట్టణ పోలీసులు సీసీ పుటేజ్లను పరిశీలించారు. దాని ఆధారంగా హైదరాబాద్లో నివాసముంటున్న మెదక్లోని పిట్లంబేస్కు చెందిన మహమ్మద్ ఖాదీర్ఖాన్ కోసం పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో ఖాదీర్ఖాన్ లేడు. మరుసటి రోజు జనవరి 29వ తేదీన అతడిని పట్టుకుని మేడ్చల్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు.
ఐదు రోజుల పాటు పోలీస్స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ నెల 2న పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అనంతరం 6న మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తన భర్తకు జరిగిన అన్యాయంపై బాదితుడి భార్య సిద్ధేశ్వరి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఖాదీర్ఖాన్ను జిల్లా కేంద్ర దవాఖానలోఓ చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీసులు కొట్టడంతో తన భర్త కిడ్నీలు పాడైపోయాయని, చేతులు, కాళ్లు పని చేయడం లేదని బాధితుడి భార్య తెలిపింది. ఎలాంటి తప్పు చేయకున్నా తన భర్తను అకారణంగా చితకబాదారని ఆరోపించింది. ప్రస్తుతం తన భర్త పరిస్థితి విషమంగా ఉందని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని ఆమె కోరింది. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సిద్ధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్ వివరణ కోరగా.. దవాఖానలో చేరిన ఖాదీర్ఖాన్కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేశామని తెలిపారు. పోలీసులు కొట్టడంతోనే కిడ్నీలు పాడైపోయాయా.. లేక ఇంతకుముందు ఖాదీర్ఖాన్కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను పరీక్షల అనంతరం తెలుస్తాయని ఆయన చెప్పారు.
డీఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్నాం: మధు, పట్టణ సీఐ
మహిళా మెడలో బంగారం దొంగతనం కేసులో మెదక్ పట్టణం పిట్లంబేస్కు చెందిన మహ్మద్ ఖాదీర్ఖాన్ను కొట్టిన విషయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నాం.