చేగుంట, సెప్టెంబర్ 24: సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని బస్టాండ్ వీధులలో, ఎన్జీవో కాలనీలో బుధవారం తెల్లవారు జామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇండ్లలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు. వారు వాడుతున్న వాహనాల వివరాలను సేకరించి, సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం డిఎస్సీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల్లో మమేకమై పోలీసుల శాఖా పనిచేయాలని ఉద్దేశంతో కమ్యూనిటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, చేగుంట పట్టణ పరిసర ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు నివాసం ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను రహస్యంగా నిలువచేసే అవకాశం ఉన్నందున్న ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు, కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలను తెలుసుకొని అద్దెకు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో అనుకొకుండా జరిగే సంఘటనలు శాంతి భద్రతలకు సంబంధించినవి, అత్యవసర పరిస్థితిలలో వెంటనే సమీప పోలీసు స్టేషన్లకు లేదా 100 నంబర్కు డయల్ చేయాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యాజమాని పత్రాలు తెచ్చినట్లుయితే వారికి వాహపాలను అప్పగిస్తామని డిఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్, రామాయంపేట సీఐలు రంగా కృష్ణ, వెంకటరాజుగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, నారాయణ, శివనర్సింహులు, నరేష్, సృజన, లింగంతో పాటు తూప్రాన్ డివిజన్ పరిధిలోని 110 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.