పటాన్చెరు, అక్టోబర్ 28 : సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో మండల స్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు భరోసాను అంది స్తూ, ప్రతి పేదవాడి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమం దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి పార్టీ కార్యకర్తలు, నాయకులు తీసుకుని వెళ్లాలన్నారు. దాదా పు రూ. 9వేల కోట్ల అభివృద్ధి పనులు చేశామని గర్వంగా చెప్పాలన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి వచ్చిన వారికి కూడా మనం ఆదరించి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగ ముత్తంగి గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, గౌతమ్ తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లోచేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్, ఎంపీపీ సుష్మా శ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.