పటాన్చెరు, జనవరి 23: మండల పరిధిలోని లక్డారం గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం లక్డారంలో రూ.4.22 కోట్లతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, కమ్యూనిటీహాల్, ప్రాథమిక పాఠశాల భవనం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డులతో పాటు చేసిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలు వెనుకబడ్డాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో ముందున్నాయన్నారు. లక్డారంలో నూతన పంచాయతీ భవనంతో పాటు గ్రామంలో స్కూల్స్కు కొత్త భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు. గ్రామంలోని అర్హులందరికీ పింఛన్లు, రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేయించి ఇచ్చామన్నారు.
పల్లె ప్రకృతి వనం, రైతువేదికలు, కమ్యూనిటీహాల్స్, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు అందజేస్తున్న సీఎస్సార్ నిధులతోనూ అనేక పనులు పూర్తి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సువర్ణమాణిక్రెడ్డి దంపతులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. అంతకు ముందు గ్రామ యువత ఎమ్మెల్యేను బైర్యాలీతో ఘనంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, బీ.వెంకట్రెడ్డి, మాణిక్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బీ.పాండు, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మల్లేశ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.