సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మినీ ఇండియాగా ప్రాచూర్యం పొందింది. 55 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 3 జీహెచ్ఎంసీ డివిజన్లతో పటాన్చెరు విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. పల్లె, పట్టణ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అభివృద్ధిలో రాష్ర్టానికే పటాన్చెరు నియోజకవర్గంగా ఆదర్శంగా నిలుస్తున్నది. పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లు జీహెచ్ఎంసీలో ఉంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు హైదరాబాద్కు ఆనుకుని మహానగరాలను తలపిస్తున్నాయి. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు ప్రగతిలో రోల్మోడల్గా నిలుస్తున్నాయి. కొల్లూర్లో దాదాపు లక్షమంది జనాభా నివసించేలా 124 ఎకరాల్లో రూ.1,432.50 కోట్లతో 15,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టౌన్షిప్ను ప్రభుత్వం నిర్మించింది. పట్టణంలో త్వరలో రూ.200కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానను సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
-పటాన్చెరు, ఏప్రిల్ 3
పటాన్చెరు, ఏప్రిల్ 3: తొమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు రూ. 6వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పటాన్చెరుకు రూ. 200 కోట్ల నిధులతో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరైంది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. పరిశ్రమలు ఉండటం ఈ ప్రాంతానికి వరంలా మారింది. పరిశ్రమలు ఇస్తున్న సీఎస్సార్ ఫండ్స్తో అనేక భవనాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సీఎస్సార్ ఫండ్స్తో విద్యారంగ అభివృద్ధికి వినియోగిస్తుండడంతో పటాన్చెరు ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నది. కాలుష్య కాసారంగా పిలిచే పటాన్చెరులో మంచి వాతావరణం కల్పించేందుకు రూ. 120 కోట్లతో పాశమైలారంలో కామన్ ఇఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. అన్ని పారిశ్రామికవాడలకు చక్కటి రోడ్లు వేస్తున్నారు. పాశమైలారం వరకు కర్ధనూర్ ఓఆర్ఆర్ నుంచి రూ. 120 కోట్లతో రోడ్డు వేస్తున్నారు. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల, అమీన్ఫూర్, పటాన్చెరు మండలాలు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి.
గ్రామాలకు కొత్తకళ..
పటాన్చెరు నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పంచాయతీలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు లభిస్తున్నది. ప్రతి గ్రామంలో సంప్లు, ట్యాంక్లు నిర్మించారు. ప్రతి గ్రామానికి మండల కేంద్రం నుంచి బీటీ రోడ్డు వేశారు. కొత్తగా అనేక గ్రామాలకు బీటీ రోడ్లను వేశారు. అన్ని గ్రామపంచాయతీల్లో గల్లీల్లో సీసీ రోడ్లు వేశారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించారు. డ్రైనేజీలు నిర్మించి గ్రామాల్లో మురుగు పారకుండా చేశారు. ఎమ్మెల్యే రూ. 4కోట్లు ఖర్చు చేసి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేయడంతో కరోనా మహమ్మారి సమయంలో ఈ ట్రాక్టర్లను వాడి పారిశుధ్య సమస్యలు లేకుండా చూశారు.
గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి తడిపొడి చెత్తను కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి పచ్చదనం నింపారు. నర్సరీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో వేలాది మొక్కలను సంరక్షిస్తున్నారు. రైతుల కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసి వారికి వ్యవసాయ అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. చెరువులను మిషన్ కాకతీయలో అభివృద్ధి చేశారు. వైకుంఠధామాలు అన్ని హంగులతో ఏర్పాటు చేసి చివరి మజిలీని గౌరవప్రదంగా మార్చారు. మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసి వాటిని పట్టుకుని అమ్ముకునేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ను నిర్మించి ఇచ్చారు. క్రీడామైదానాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.
గ్రేటర్లో 3 డివిజన్లు జిగేల్..
పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధిలో జిగేల్మంటున్నాయి. సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పెద్ద ఎత్తున నిర్మించారు. అపార్టుమెంట్ కల్చర్ పెరగడంతో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. పటాన్చెరు డివిజన్లో ఈ మూడేండ్ల్లలోనే రూ. 127కోట్ల అభివృద్ధి జరిగింది. పటాన్చెరు పట్టణంలో విశాలమైన రహదార్లు, థీమ్ పార్క్లు, ఓపెన్ జిమ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామచంద్రాపురం డివిజన్లో జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఇప్పుడా సమస్యకు విముక్తి లభించింది.
రామచంద్రాపురం డివిజన్లో కార్పొరేటర్ రూ.28 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. భారతీనగర్లోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించారు. దాదాపు రూ.30కోట్ల అభివృద్ధి పనులు రెండేండ్లలోనే జరిగాయి. గత ఎనిమిదేండ్లలో మూడు డివిజన్లలో రూ.600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయి. కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పనగేశ్, సింధూ ఆదర్శ్రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే సహకారంతో పనులు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. పటాన్చెరు పట్టణంలో దాదాపు రూ.280కోట్ల విలువైన టీఎస్ఐఐసీ భూమిని మార్కెట్ యార్డుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించడంతో రైతులు, చిరువ్యాపారులకు వరంలా మారింది. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఇప్పుడు రూ.7కోట్ల బడ్జెట్తో అంచలంచెలుగా వృద్ధి చెందుతున్నది.
మున్సిపాలిటీల్లో అభివృద్ధి భళా..
పటాన్చెరు నియోజకవర్గంలో బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారాయి. ఇవి హైదరాబాద్కు ఆనుకుని ఉండడంతో అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పుడు ఈ మూడు పట్టణాలు నగరంలో భాగమయ్యాయి. సాఫ్ట్వేర్, ఫార్మా, ఇంజినీరింగ్ పరిశ్రమలు దగ్గరగా ఉండటంతో ఉద్యోగులు ఈ మూడు పట్టణాల్లో నివసించేందుకు మొగ్గు చూపుతున్నారు. వందల కాలనీలు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం నివాసయోగ్యంగా మారింది. అమీన్ఫూర్లో దాదాపు 150కి పైగా కాలనీలుండగా, దాదాపు 2 లక్షల జనాభా నివసిస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించేందుకు ఇప్పటికే రెండు రిజర్వాయర్లు నిర్మించారు. మరో రెండు రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 30కోట్లు ఖర్చు చేస్తున్నారు.
అమీన్ఫూర్ పరిధిలో 10లక్షల లీటర్ల రిజర్వాయర్లు రెండు, 40లక్షల లీటర్ల రిజర్వాయర్లు ఒకటి, 20లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు రెండు నిర్మిస్తున్నారు. కోటి లీటర్ల నీటిని నిలువ చేసే రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ.100 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే బీరంగూడ గుట్టపై రిజర్వాయర్లు పూర్తయ్యాయి. అమీన్ఫూర్లో మున్సిపల్గా మారిన తర్వాత రూ. 186కోట్ల అభివృద్ధి జరిగింది. బొల్లారంలో ఒక రిజర్వాయర్ 25లక్షల లీటర్లతో సామర్థ్యంతో నిర్మాణంలో ఉంది. పారిశ్రామికవాడలు ఉండటంతో బొల్లారంలో సీఎస్సార్ నిధులతో పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధ్దిలో కొత్త పుంతలు తొక్కుతున్నది. రూ. 103కోట్ల అభివృద్ధి పనులు ఇక్కడ జరిగాయి. రేడియల్ రోడ్లకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్కోసం రూ.30కోట్లు , హెచ్ఎండీఏ రోడ్లు, డ్రైనేజీకి రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారు. తెల్లాపూర్లోనే రూ. 453కోట్ల అభివృద్ధి జరిగింది.
పారిశ్రామికవాడలకు కొత్త వెలుగులు
పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, రుద్రారం, గండిగూడల్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. కొత్తగా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లో మెడికల్ డివైజ్ పార్క్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పార్కుకు పరిశ్రమలు పోటెత్తుతున్నాయి. 241.52 ఎకరాల్లో ఏర్పాటైన జనరల్ పార్కులో 92 యూనిట్లకు ఇప్పటికే 69 యూనిట్లు అనుమతులు పొందాయి. వీటిలో 19 ప్రారంభమయ్యాయి. 50 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక్కడ రూ. 744కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 6,458 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నది. జిన్నారం మండలం శివానగర్ ఎల్ఈడీ పార్కును 66.67 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 26 పరిశ్రమలు వాటిలో యూనిట్లు పెట్టేందుకు అనుమతులు తీసుకున్నాయి. రూ. 328 కోట్లతో పరిశ్రమలను స్థాపిస్తున్నారు. 1,746 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తారు.
శివానగర్లోనే జనరల్ పార్కులో 47 ఎకరాలను కేటాయించారు. వీటిలో 28 యూనిట్లు రాబోతున్నాయి. రూ.129కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దాదాపు 2,361మందికి ఉపాధి లభిస్తుంది. కొత్తగా వస్తున్న తెల్లాపూర్, ఉస్మాన్నగర్, నాగులపల్లి, కొల్లూర్లో ఐటీ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం పాత పారిశ్రామికవాడల్లో మూతపడిన పరిశ్రమలను టేకోవర్ చేసి కొత్త పరిశ్రమలు పెడుతున్నారు. కోతలు లేని కరెంట్ను తెలంగాణ సర్కారు ఇస్తుండటంతో పారిశ్రామికవాడల్లో భారీగా నూతన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఏ పారిశ్రామికవాడలో చూసినా మూడు షిప్టులతో పరిశ్రమలు నడుస్తున్నాయి. రింగురోడ్డు సౌకర్యం ఉండటంతో పలు రకాల కార్గో సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి గ్యారంటీ అన్నట్టుగా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు వరం..
పటాన్చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు వరంలా మారాయి. కొల్లూర్లో 124 ఎకరాల్లో రూ.1,432.50 కోట్లతో 15,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టౌన్షిప్ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. 117 బ్లాక్లు, ప్రతి బ్లాక్లో లిఫ్టులతో పాటు ఏ-ప్లస్ 11 అంతస్తులు చొప్పున నిర్మించింది. జీహెచ్ఎంసీలో నివసిస్తున్న నిరుపేదలకు ఈ ఇండ్లను అందజేస్తారు. దాదాపు లక్ష వరకు జనాభా ఈ టౌన్షిప్లో నివసించేలా సౌకర్యాలతో ప్రభుత్వం ఈ టౌన్షిప్ నిర్మించింది. ఇక అమీన్ఫూర్-1లో 176 ఇండ్లు, అమీన్పూర్-2లో 1,836 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అమీన్పూర్-3లో 3,240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అపార్టుమెంట్లుగా ప్రభుత్వం నిర్మిస్తున్నది.
కిష్టారెడ్డిపేటలో 432, పటాన్చెరు మండలం పోచారంలో 720, కర్ధనూర్-1లో 1620, కర్ధనూర్-2లో 540 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. రామచంద్రాపురం మండలం ఇదులనాగులపల్లిలో 1,944 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించేందుకు యోచిస్తున్నారు. మొత్తంగా రూ. 2,439 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిద్వారా 28,220 ఇండ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కొన్ని పనులు నిర్మాణంలో ఉన్నాయి. కొల్లూర్, కర్ధనూర్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలోనే అర్హులకు అందించనున్నారు.
సీఎస్ఆర్ నిధులు వరం…
పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో సీఎస్సార్ నిధులతో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికవాడలకు దగ్గరగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పరిశ్రమల నుంచి సీఎస్సార్ నిధులు ఖర్చు చేస్తున్నారు. దాదాపు నూ.7కోట్లతో పటాన్చెరులో డిగ్రీ కళాశాలను నిర్మించారు. పక్కన జడ్పీహెచ్ఎస్, ఇంటర్ కళాశాలను నిర్మించారు. ఇస్నాపూర్, పాశమైలారం, ముత్తంగి, కాజీపల్లి వంటి గ్రామాల్లో సీఎస్సార్ నిధులతో పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నారు. గ్రామపంచాయతీల్లో ఆర్వో ప్లాంట్లు నిర్మించి శుద్ధ నీటిని ఇస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. జలమండలి ఆధ్వర్యంలో పటాన్చెరు, భారతీనగర్, ఆర్సీపురం జీహెచ్ఎంసీడివిజన్లకు తాగునీరు అందిస్తున్నారు. రింగురోడ్డు చుట్టూ మిషన్ భగీరథ కొత్త పైప్లైన్ వేశారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేశా..
మినీ ఇండియాగా పిలిచే పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేశా. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దా. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. ముందుచూపుతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశాం. పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కరించాం. శుద్ధమైన నీటిని ఇస్తున్నాం. కమ్యూనిటీ హాల్స్ను నిర్మించాం. కల్యాణ మండపాలు, షాదీఖానాలు ఏర్పాటు చేశాం. క్రీడామైదానాలు, పార్కులు నిర్మించాం. సీఎస్సార్ నిధులతో పలు సౌకర్యాలు కల్పించాం. సీఎం రిలీఫ్ఫండ్స్తో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పించాం. త్వరలో పటాన్చెరులో రూ.200కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. నియోజకవర్గంలో దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు సంతోషంగా బతుకుతున్నారు. వారందరి సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నది.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే