సంగారెడ్డి, మే 26(నమస్తే తెలంగాణ) : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మంగళవారం సంగారెడ్డి జిల్లా లో జరిగిన పార్టీ శిక్షణ శిబిరం రసాభాసగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ శిక్షణ శిబిరంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తీరుపై బీబీ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘బీజేపీ మీ అయ్య జాగీరు కాదు..నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ’ బీబీ పాటిల్ గోదావరి అంజిరెడ్డిని హెచ్చరించారు. సమావేశానికి పిలిచి తనను అవమానించటాన్ని జీర్ణించుకోలేకపోయిన బీబీ పాటిల్, సమావేశం నుంచి మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. బీబీ పాటిల్ మద్దతుదారులు గోదావరి అంజిరెడ్డితో గొడవకు దిగడంతో శిక్షణ శిబిరం రచ్చగా మారింది. బీబీ పాటిల్ మద్దతుదారులైన జహీరాబాద్ ప్రాంత బీజేపీ నా యకులు జిల్లా అధ్యక్షురాలు డౌన్డౌన్ అం టూ నినాదాలు చేశారు. శిక్షణ శిబిరానికి హా జరైన పటాన్చెరుకు చెందిన నాయకుడు ఆశీష్గౌడ్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలి తీరును నిరసిస్తూ ఆశీష్గౌడ్ శిక్షణ శిబిరం నుంచి వెళ్లిపోయారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లిలో బీజేపీ నాయకుడు దేశ్పాండేకు చెందిన ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో రెండురోజులపాటు బీజేపీ శిక్షణ శిబిరం జరిగింది. పార్టీ రాష్ట్ర నేత చంద్రశేఖర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిక్షణ శిబిరానికి ఎంపీ రఘునందన్రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా నాయకులు హాజరయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శిక్షణ శిబిరానికి హాజరైన బీబీ పాటిల్ను జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి వేదికపైకి ఆహ్వానించలేదు. చాలాసేపు నాయకులతోపాటు కిందనే కూర్చున్న బీబీ పాటిల్ను, తనను వేదికపైకి పిలుస్తారని వేచి చూసినా పిలవకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
చాలాసేపటి తర్వాత తనను వేదికి మీదికి ఆహ్వానించారని, ఆ తర్వాత తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీబీ పాటిల్ కోరారు. ‘పార్టీ నిబంధనలు మీకు తెలియవా..మీరు ఎలా మధ్యలో మాట్లాతారు…మీకు ఇప్పుడే అవకాశం ఎలా ఇస్తారు’ అంటూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బీబీ పాటిల్ను అవమానించినట్లు తెలిసింది. సమావేశంలో అందరి మధ్య తనను అవమానించటాన్ని జీర్ణించుకోలేకపోయిన బీబీ పాటిల్ అక్కడే గోదావరి అంజిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి పిలిచి నన్ను అవమానిస్తారా, ఇదేం పద్ధ్దతి అంటూ మండిపడ్డారు.
‘బీజేపీ ఆప్కా బాప్కా పార్టీ నహీ హై…ఆపక్ కా మన్మానీ నహీ ఛలేగా’ అంటూ గోదావరి అంజిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా బీబీ పాటిల్, గోదావరి అంజిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి మద్దతుదారులు గొడవకు దిగడంతో సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. చివరకు బీబీ పాటిల్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి తీరును నిరసిస్తూ సమావేశంలో నుంచి వెళ్లిపోయారు. జిల్లా అధ్యక్షురాలు తనను సమావేశాలకు పిలవడం లేదనని, పిలిచినా తనను గౌరవించడం లేదని, ఒంటెత్తు పోకడడంతో పార్టీకి నష్టం కలిగిస్తుందని బీబీ పాటిల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్కు ఫోన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఆశీష్గౌడ్ మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారని, వారిని ఎందుకు కట్టడి చేయటంలేదని గోదావరి అంజిరెడ్డి ఆశీష్గౌడ్ను ప్రశ్నించారు. వాటి తో తనకు సంబంధంలేదని ఆశీష్గౌడ్ వివరణ ఇచ్చినా వినకుండా గోదావరి అంజిరెడ్డి గొడవకు దిగడంతో, ఆశీష్గౌడ్ ఆమె తీరును నిరసిస్తూ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. కొంతకాలంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తీరుతో పార్టీలోని జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధు లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ఆమె భర్త అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆమె ఎవరినీ పట్టించుకోవటం లేద ని, ఒంటెత్తు పోకడను ప్రదర్శిస్తూ ,తనకు నచ్చినట్లు పార్టీని నడిపిస్తున్నారని పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కొన్ని నెలలుగా నూతన అధ్యక్షుడిని నియమించాలంటూ పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులను కోరుతూ వస్తున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నూతన అధ్యక్షుడిని ని యమించే యోచనలో ఉన్నట్లు సమాచారం.