నేడు పట్టణంలోని మైత్రీ క్రీడామైదానాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులు, సీఎస్ఆర్ ఫండ్స్ రూ.7.25 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంగా తీర్చిదిద్దారు. జిమ్, ఇండోర్ గేమ్స్ శిక్షణ కోసం గదులను ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ ప్రహరీ, వేదికను నిర్మించారు. ఏరియా దవాఖానలో ఆక్సిజన్ కొరతను అరికట్టేందుకు ఏషియన్ పెయింట్స్ సహకారంతో రూ.1.10 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యంతో పారిశ్రామికవాడ ప్రజలు, కార్మికులకు ఎంతో మేలు జరుగునున్నది. ఈ కార్యక్రమాలను ఆదివారం వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, జూన్4: పటాన్చెరులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో రూ.7.25 కోట్ల ఖర్చుతో నిర్మించిన స్టేడియం, స్పోర్ట్స్ బిల్డింగ్ను, రూ.1.10కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించనుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు.
పటాన్చెరు పట్టణంలోని మైత్రీ క్రీడా మైదానానికి దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఎందరో క్రీడాకారులు ఈ స్టేడియంలో ఆడి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలతో పాటు ఇతర ఆటలకు ఈ మైదానం కేంద్రంగా ఉన్నది. ఇక్కడ లీగ్స్తో పాటు అనేక టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తుంటారు. దశాబ్దాలుగా ఈ మైదానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మైదానాన్ని స్టేడియంగా మార్చేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులు, సీఎస్ఆర్ ఫండ్స్ రూ.3.85 కోట్లతో మైదానాన్ని అభివృద్ధి చేసి, రూ.3.40 కోట్లతో స్పోర్ట్స్ క్లబ్ను నిర్మించారు. మొత్తంగా రూ.7.25 కోట్లు స్టేడియంపై ఖర్చు చేశారు. అత్యాధునిక వసతులతో జిమ్ సౌకర్యం, ఇండోర్గేమ్స్ ఆడేలా ఈ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటైంది. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేలా గదులు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మించడంతో భద్రత ఏర్పడింది. ఒకవైపు వేదికతో పాటు స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు.
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుతో రోగులకు ధీమా..
పటాన్చెరు ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్తో రోగులకు ధీమా ఏర్పడింది. రెండేండ్లుగా కరోనా సమయంలో వచ్చిన ఆక్సిజన్ డిమాండ్ను చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో ఏషియన్ పెయింట్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి వారి సీఎస్సార్ నిధులు రూ.1.10 కోట్లు ఖర్చు చేసి, 500 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ ప్లాంట్తో పాటు, పీఎం కేర్ ద్వారా మంజూరైన మరో 500 లీటర్ల ఆక్సిజన్ యూనిట్ను మంత్రి ప్రారంభించనున్నారు.
పటాన్చెరు ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్
పటాన్చెరులో స్పోర్ట్స్ హబ్..
పటాన్చెరు నియోజకవర్గం స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెందుతున్నది. నియోజకవర్గంలో ఇప్పటికే మూడు మినీ స్టేడియాలను ఏర్పాటు చేస్తున్నాం. పటాన్చెరు పట్టణంలోని మైత్రీ మైదానాన్ని స్టేడియంగా అభివృద్ధి చేశాం. అన్ని రకాల వసతులను కల్పించడంతో క్రీడాకారులకు మేలు జరుగుతుంది. పటాన్చెరు నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రావాలని ఖర్చుకు వెనుకాడకుండా స్టేడియంలో వసతులను కల్పించాం. మంత్రి హరిశ్రావు వాటిని ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని వస్తారు. దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ రోగుల అవసరాలను తీరుస్తుంది.
– మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే