మెదక్, మే 13 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ పరిధిలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5.30 గంటలకు ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహంచారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉత్సాహంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక సిబ్బంది వాటిని సరిచేశారు. కొన్ని ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని అమర్చారు.
మొత్తమ్మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల వరకు 10.99 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 28.30శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46.72శాతం నమోదు కాగా, 3 గంటల వరకు 60.94 శాతం నమోదైంది. సాయం త్రం 5 గంటల వరకు 71.33శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 73.63 శాతం నమోదైంది.
తొలిసారి ఓటేసేందుకు భారీసంఖ్యలో యువత ఆసక్తి చూపారు. కొత్త దంపతులు, వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట మండలం కోనాపూర్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో ఎమ్మెల్యే రోహిత్ దంపతులు ఓటేశారు. హవేళీఘనపూర్ మండలం కుచన్పల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఓటేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పాపన్నపేట మండలం యూసుఫ్పేటలో ఓటేశారు. నిజాంపేట మండలం కల్వకుంటలో బీఆర్ఎస్ నాయకుడు తిరుపతిరెడ్డి ఓటేశారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది అవగాహన లోపంతో నియోజకవర్గంలోని పలుచోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించడంతో అక్కడక్కడ ప్రజలు, మహిళలు వేచి ఉన్నారు. మాసాయిపేట మండలకేంద్రంలోని 25వ పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ మండలం మక్తభూపతిపూర్లో అరగంటపాటు ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు క్యూలోనే నిల్చున్నారు.
పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మెదక్ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలతోపాటు సాయుధ బలగాలు పర్యవేక్షించాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ప్రజలు నిలబడకుండా చర్యలు తీసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండల కేంద్రాల్లో జిల్లా ఎస్పీ బాలస్వామి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నర్సాపూర్ మండలకేంద్రంలో పోలింగ్ కేంద్రాన్ని మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ సందర్శించారు.