ఉత్సాహంగా పల్లె, ప్రట్టణ ప్రగతి
పలుచోట్ల శ్రమదానం,అవగాహన సదస్సులు
వీధులు, మురుగు కాల్వలు శుభ్రం
హరితహారం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
అభివృద్ధి పనులు తనిఖీ చేసిన అధికారులు
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచన
పల్లెల్లో క్రీడాప్రాంగణాల కోసం స్థలాల పరిశీలన
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హుషారుగా పాల్గొంటున్నారు. మూడో రోజూ ఆదివారం కాలనీల్లో చెత్తాచెదారం, మట్టికుప్పలు, డెబ్రీస్ను తొలిగించి పరిసరాలను శుభ్రంగా మార్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మదన్రెడ్డి, రామాయంపేట మండలం డీ.ధర్మారంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. ఆర్. వెంకటాపూర్, లక్ష్మాపూర్లో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో ఇంటింటికీ తిరిగి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో డీపీవో సురేశ్ మోహన్ పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులను వివరించారు.
మెదక్/సంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్, జూన్5 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలిగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. మారుమూల పల్లెలు, మధిర గ్రామాలు, తండాలు, వాడల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రజాప్రతినిధులు తెలిపారు.
పల్లె ప్రగతి ఓ గొప్ప సంకల్పమని, గ్రామాలను ఆదర్శంగా మార్చుకునేందుకు ఈ కార్యక్రమం బృహత్తరంగా పనిచేస్తున్నదని వారు పేర్కొంటున్నారు. ప్రగతితో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
మెదక్: జిల్లా కేంద్రంలోని 14 వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, పాల్గొన్న కమిషనర్ , తదితరులు
చిలిపిచెడ్: చండూర్లో మొక్క నాటి నీరు పోస్తున్న ఎంపీడీవో కృష్ణమోహన్, కార్యదర్శి జితేందర్
రామాయంపేట: వెంకటాపూర్లో నర్సరీని పరిశీలిస్తున్న డీపీవో తరుణ్