మెదక్ అర్బన్ ,ఏప్రిల్ 12: మెదక్లోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె సందర్శించి, విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ..మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని తెలిపారు. కళాశాల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక కంపుతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి అదనపు మెస్చార్జీలు వసూలు చేస్తున్నందుకు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులను బెదిరించడం , భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు.
వారం రోజుల్లో కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో సదుపాయాలు కల్పించడం లేదన్నారు. కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్లీడర్ మామిండ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్రావు, కౌన్సిలర్లు బట్టిఉదయ్, దీప్కుమార్, నాయకులు లంగారెడ్డి, సురేందర్గౌడ్, క్రిష్ణగౌడ్, మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, సంతోష్, సాయి కుమార్, నవీన్, బాలరాజు, శ్రీలత, వెంకట్, కిరణ్, స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.