రామాయంపేట, జూన్ 26 : విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు.
నెల రోజులుగా తమ పంట కొనడం లేదని, తీసుకున్న జొన్నలను మట్టి పెళ్లల పేరిట తిరిగి లారీలను పంపించి వేశారని మాజీ ఎమ్మెల్యేతో మహిళా రైతులు గోడు వెల్లబోసుకున్నారు.రెండు నెలలు రోడ్లపై జొన్నలు ఆరబోస్తే, తీరా కొనకుండా వాపస్ పంపడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎస్సై బాలరాజును పిలిచి జొన్నలను సాధ్యమైనంత తొందరగా వెళ్లే ఏర్పాటు చేయాలని పద్మాదేవేందర్రెడ్డి సూచించారు.అక్కడి నుంచే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జొన్నల విషయమై ఫోన్లో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు.
జొన్నలను కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని మంత్రి దాటవేశారు.అనంతరం విలేకరులతో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు.రైతులు పంట మార్పిడి పాటించాలని ప్రభుత్వం చెబితే, వడ్లకు బదులు జొన్నలు పండిస్తే కొనక పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతుల విషయంలో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే కలెక్టర్ ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెంట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, సుధాకర్రెడ్డి, నగేష్, అబ్దుల్ అజీజ్, రాజు యాదవ్, నీల రాజు, కృష్ణాగౌడ్, మద్దెల రమేశ్ ఉన్నారు.