చిన్నశంకరంపేట, మే 21: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో వడ్లు కొనడం లేదని ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం అంబాజిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
మెదక్ ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న రాజయ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు రాజయ్యది ఆత్మహత్య కాదని, సర్కార్ హత్యేనని విమర్శించారు. రాజయ్య ధాన్యాన్ని ముందు తూకం వేసి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు కాదన్నారు. ఇప్పుడు తూకం వేస్తే ఏమి ప్రయోజనమని అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా తూకం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు సమీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను ఎందుకు పంప డం లేదని డీసీవో కరుణాకర్ను ప్రశ్నించారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రానికి లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్లు సిద్ధిరాములు, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, శ్రీను, పోచయ్య, దయానంద్ యాదవ్, నాగరాజు, లక్ష్మణ్రాజు, మోహన్, రైతులు పాల్గొన్నారు.