వెద సాగుతో రైతులు లాభాలు గడించాడు. వెదజల్లే పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించగా, మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి ఎనిమిదెకరాల్లో సాగు చేశాడు. 256 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. వెద సాగులో ఆదర్శంగా నిలిచాడు.
మర్కూక్, డిసెంబర్ 20 : మర్కూక్ మం డలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి వ్యవసాయాధికారుల సూచన మేరకు తనకున్న ఎనిమిది ఎకరాల్లో వరి వెదసాగు చేశాడు. గతేడాది వరికి బదులు ప్రభుత్వం వెద సాగును విధానాన్ని ప్రోత్సహించింది. ఈ పద్ధతిపై ప్రచారం చేయడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని అధికారులు వివరించారు. దీంతో రైతు వెదసాగుపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. వరి రకం జేజీఎల్ రకం 24423 అనే రకాన్ని విత్తనం వేశాడు. వెద పద్ధతిలో కూలీల సంఖ్య కూడా తగ్గిందని రైతు తెలిపాడు. అలాగే పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గిందని రైతు వివరించాడు. మరో రెండు ఎకరాల్లో సాధారణ పద్ధతి వరిని సాగు చేశాడు. కాగా, రెండు పంటలకు వేర్వురుగా పెట్టుబడి పెట్టాడు. వెదసాగు కంటే సాధారణ పంటకే పెట్టుబడి ఎక్కువగా వస్తుందని చెప్పాడు.
వెదసాగు ఇలా..
వెదసాగు పద్ధతి ద్వారా ఎకరానికి పది కిలోల విత్తనాలు అవసరం. నారుమడి, నారు తీయడం. పంచడం లాంటి పద్ధతులు ఉండవు. అలాగే కలుపు మాత్రం ఒకసారి తీయాల్సి ఉంటుంది. వెదసాగు పద్ధతికి రూ.19,700 ఖర్చవుతుంది. దిగుబడి ఎకరానికి 32 క్వింటాళ్లు వస్తుంది. ఎకరం సాగు ద్వారా రైతు దాదాపుగా రూ.62,720 దిగుబడి వచ్చిందని, అన్ని ఖర్చులు పోనూ రూ.43,020 మిగులుతుందని రైతులు వివరించాడు. సాధారణ పద్ధతిలో అయితే ఎకరానికి సుమారు పెట్టుబడి ఖర్చు రూ.25 వేల ఖర్చు వస్తుందని చెప్పాడు. ఎకరానికి 29 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని, తక్కువ లాభం వస్తుందని రైతు పేర్కొన్నాడు.
వెదసాగుతో లాభాలు..
సాధారణ సాగు కంటే వరి పంట విధానం వేదసాగు పద్ధతిలో బాగుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చింది. వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనల మేరకు ఎనిమిదెకరాల్లో వెద సాగు ద్వారా వరి వేసిన. ఎకరానికి 32 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. యాసంగిలో కూడా వెదసాగే చేస్తా. ప్రభుత్వం కూడా వెదసాగును ప్రోత్సహిస్తున్నది.
– వెంకట్రెడ్డి, రైతు, ఎర్రవల్లి