రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటులాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలకు వచ్చే బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తూప్రాన్ ఏరియా దవాఖానలో ఎక్స్రే, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫొటోథెరపీ, బేబీ వార్మర్ తదితర సౌకర్యాలు కల్పించగా, తాజాగా ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం రూ.50లక్షలు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే 500 ఎల్పీఏ సామర్థ్యం గల భారీ సిలిండర్లను బిగించారు. మరో రెండు నెలల్లో ఆక్సిజన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ ప్లాంటు వాతావరణంలోని గాలిని తీసుకుని ఆక్సిజన్ను స్వయంగా ఉత్పత్తి చేసుకొని రోగులకు అందిస్తుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. దవాఖానకు ప్రతి రోజూ 600 మంది రోగులు వస్తుండగా, 85 మంది ఇన్ పేషెంట్లు చేరుతున్నారు.
నర్సాపూర్, డిసెంబర్11: ప్రతి ప్రాణి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో అవసరం. రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. కరోనా సమయంలో బాధితులకు ఆక్సిజన్ అందక ఎంత ఇబ్బందిపడ్డారో అందరికీ అనుభవమైంది. ఆక్సిజన్ విలువను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో..
నర్సాపూర్లోని వంద పడకల ప్రభుత్వ ఏరియా దవాఖాన అత్యాధునిక పరికరాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నది. రోజురోజుకు వైద్య పరికరాలు పెంచుతూ నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ దవాఖానలో 15 మంది వైద్యులు, 120 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు రోజూ సుమారు 600 మంది వరకు రోగులు వస్తుంటారు. సుమారు 85 వరకు ఇన్ పేషెంట్లు చేరుతున్నారు. ఇప్పటికే ఈ దవాఖానలో ఎక్స్రే, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫొటోథెరఫీ, బేబీ వార్మర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులో లేక బయట నుంచి సిలిండర్లను తెప్పించి రోగులకు అందిస్తున్నారు. ఇక మీదట రోగులకు ఆక్సిజన్ అందించడంలో ఎలాంటి ఇబ్బందులు పడొద్దని దవాఖానలోనే ప్లాంటు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
రూ.50 లక్షల నిధులు మంజూరు
ఈ దవాఖానలో పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సప్షన్) ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. 500 ఎల్పీఏ సామర్థ్యం గల సిలిండర్లను దవాఖాన ఆవరణలో మెగా కంపెనీ ఏర్పాటు చేసింది. దవాఖానలో షెడ్డు ఏర్పాటు చేసి అందులో ఆక్సిజన్ సిలిండర్లు బిగించారు. కరోనా, రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం, పాముకాటు, డెలివరీ తర్వాత తీవ్ర రక్తస్రావం వంటి అత్యవసర కేసులకు ఆక్సిజన్ అందించనున్నారు. గతంలో ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులో లేక ప్రైవేట్ దవాఖానలకు పంపించాల్సి వచ్చేది. కానీ నేడు ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే రోగులకు ఆర్థిక భారం, ప్రాణ నష్టం తగ్గనున్నది. ఆక్సిజన్ సేవలను అత్యవసర విభాగాలైన ఐసీయూ, క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్లలో ప్లాంట్ నుంచి నేరుగా అందించనున్నారు. ఈ ప్లాంటు వాతావరణంలోని గాలిని సేకరించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి అందించనున్నది.
రెండు నెలల్లో అందుబాటులోకి..
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ప్లాంటు ఏర్పాటు పనులు పూర్తై ఆక్సిజన్ అందుబాటులోకి రానున్నది. ప్లాంట్ ఏర్పాటుతో రోగులకు ఖర్చులు, సమయం వృథా లాంటి బాధలు తీరుతాయి. ఇక మీద అత్యవసర సమయాల్లో ఆక్సిజన్కు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించడం తప్పుతుంది. ఇప్పటికే దవాఖానలో అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు సేవలు అందిస్తున్నాం.
– డా.మీర్జా నాజిమ్ బేగ్, దవాఖాన సూపరింటెండెంట్, నర్సాపూర్