బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం జోరువాన కురిసింది. రెండు, మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. చెరువులు, చెక్డ్యాంలు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నారింజ ప్రాజెక్టు నిండి గేటుపై నుంచి నీరు ప్రవహిస్తుండగా, సింగూరులో స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. వనదుర్గా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు ఆగస్టు నుంచి సరైన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతుల్లో విస్తారంగా కురుస్తున్న వానలు ఆశలు పెంచాయి. ఎండిపోయే దశలో ఉన్న వరి, పత్తి, కందితో పాటు ఇతర పంటలకు జీవం పోశాయి. భారీ వర్షాలు పడుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు శరత్కుమార్, రాజర్షిషా ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో వందశాతం పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 4
మెదక్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వరుణ దేవుడు కరుణించడంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం మొదలై సోమవారం వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న పంటలకు ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో వానకాలంలో 3.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే జూన్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. దీంతో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యాయి. ఆగస్టులో వారం పది రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోయే స్థితికి చేరుకన్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షం ఊరటనిచ్చింది. జిల్లా వ్యాప్తంగా 48.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా, కౌడిపల్లి మండలంలో 86.7 మి.మీ, రేగోడ్లో 72.3 మి.మీ, చిలిపిచెడ్ మండలంలో 70.6 మి.మీ, చిన్నశంకరంపేటలో 70.6 మి.మీ, పెద్దశంకరంపేటలో 67.9 మి.మీ, కొల్చారంలో 62.5 మి.మీ, నార్సింగిలో 62.0 మి.మీ, వెల్దుర్తిలో 58.9 మి.మీ, చేగుంటలో 56.4 మి.మీ, రామాయంపేటలో 48.8 మి.మీ, హవేళీఘనపూర్లో 41.0 మి.మీ, మెదక్లో 48.7 మి.మీల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరికి ప్రాణం..
మెదక్ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ మధ్య వర్షాలు లేకపోవడంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి 38,751, కందులు 1069, మొక్కజొన్న 3499, జొన్నలు 65, పెసర్లు 976, మినుములు 257, ఇతర పంటలు 22వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. సుమారు నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండవనుకునే పరిస్థితి వస్తుందనుకోవడంతో వర్షాలు కురవడంతో పంటలకు మేలు జరిగింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. వర్షాలతో జిల్లాలోని జలవనరులు నిండుతున్నాయి. కొంతకాలంగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షాలతో ఊరట లభించింది. వర్షాలతో జిల్లాలోని పత్తి, కందితోపాటు ఇతర పంటలకు మేలు జరగనున్నది. భారీగా కురిసిన వర్షాలకు జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రాజెక్టు గేటుపై నుంచి జలాలు ప్రవహిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద చేరింది. సోమవారం జిల్లాలో 44.8 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 13.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. పటాన్చెరు మండలంలో అత్యల్పంగా 7.6 మి.మీటర్ల వర్షం కురిసింది. మొగుడంపల్లి మండలంలో 98.1 మి.మీటర్లు, జహీరాబాద్లో 90.7, నిజాంపేటలో 68.8, రాయికోడ్లో 64.6, న్యాల్కల్లో 63.7, మనూరులో 62.8 మి.మీటర్ల వర్షం కురిసింది. సిర్గాపూర్ మండలంలో 58.2, వట్పల్లిలో 55.5, ఝరాసంగంలో 53.7, పుల్కల్లో 52.2, నాగల్గిద్దలో 49.6, అందోల్లో 49.2, కోహీర్ 47.7, కల్హేర్లో 43.1 మి.మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో 9 నుంచి 33 మి.మీటర్లలోపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వర్షాలతో నిండుతున్న చెరువులు..
సంగారెడ్డి జిల్లాలోని కురిసిన వర్షాలకు సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద చేరింది. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎమ్మెల్యే మాణిక్రావు ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. మునిపల్లి మండలం చిన్నచెల్మడ-అంతారం మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంగ్టి నుంచి బీదర్ వెళ్లే దారిలో ఉండే బ్రీమా వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1374 చెరువులు ఉండగా, 638 చెరువులు పూర్తిగా నిండాయి. 14 చెరువులు అలుగు పారుతున్నాయి. జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్లో ఆరు, నారాయణఖేడ్ ఇరిగేషన్ డివిజన్లో ఆరు, సంగారెడ్డి డివిజన్లో రెండు చెరువులు అలుగు పారుతున్నాయి.
వర్షాలతో పంటలకు మేలు..
వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా జిల్లాలో వర్షాలు కురవకపోవ డంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. పత్తి, కందితోపాటు ఇతర పంటలకు వర్షాలతో మేలు జరుగనున్నది. వానకాలంలో 7.13 లక్షల ఎకరాలు సాగు అయింది. 3.50 లక్షల ఎకరాల్లో పత్తి, 78వేల ఎకరాల్లో సోయాబీన్, 83 ఎకరాల్లో కంది పంటను రైతులు అధికంగా సాగు చేశారు.